విద్యార్థిని చంపిన పులి మనుషుల్ని తినేది కాదట, వాళ్లే
న్యూఢిల్లీ: రెండు రోజుల క్రితం ఢిల్లీలోని జూలో ఓ తెల్ల పులి ఇంటర్ సెకండియర్ విద్యార్థిని నోట కరిచి చంపిన విషయం తెలిసిందే. అయితే, ఆ తెల్ల పులి మనుషులను తినేది కాదని ఢిల్లీ జూ అధికారులు చెబుతున్నారు. ఈ తెల్లపులి పేరు విజయ్. విజయ్ మనుషులను చంపే రకం కాదని జూ అధికారులు చెబుతున్నారు.
విజయ్ జూలోనే జన్మించిందని, ఇక్కడే పెరిగిందని, దానికి వేటాడం తెలియదని జూ అధికారులు చెప్పారని తెలుస్తోంది. విజయ్ 2007లో లక్ష్మణ్, యమునలకు పుట్టింది.
నేషనల్ జులాజికల్ పార్క్ క్యురేటర్ ఆర్ఏ ఖాన్ విజయ్ గురించి మాట్లాడారు. విజయ్ ప్రస్తుతం బాగానే కనిపిస్తోందని చెప్పారు. అయినప్పటికీ తాము మరో నాలుగైదు రోజుల పాటు దానిని అబ్జర్వేషన్లో ఉంచుతామని చెప్పారు. విద్యార్థిని చంపిన అనంతరం ఇప్పటి వరకు అది అసాధారణంగా ఏమీ ప్రవర్తించలేదని చెప్పారు.
ఏడేళ్ల వయస్సు గల విజయ్ ప్రతిరోజు క్రమంగా ఫుడ్ తీసుకుంటుందని, ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. దానికి పదికిలోల దున్నపోతు మాంసం ఇచ్చామని, స్నానం చేయించినట్లు చెప్పారు. ఇది ప్రతిరోజు సాయంత్రం నాలుగున్నరకు తింటుందని చెప్పారు. ఈ పులి మనుషులను తినేరకం కాదని చెప్పారు.
ఎన్క్లోజర్లో ఇరవయ్యేళ్ల విద్యార్థి మక్సూద్ పడిపోయినప్పుడు పులి పైన రాళ్లు వేయడం, బిగ్గరగా అరవడం చేయడాన్ని ఆయన తప్పుపట్టారని సమాచారం. పులి ఉన్న ఎన్క్లోజర్ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు సదరు విద్యార్థిని రెండుసార్లు ఆపారని, అయినప్పటికీ గార్డు చూడని సమయంలో అతను ముందుకు వెళ్లాడని, అనంతరం ఎన్క్లోజర్లో పడిపోయాడని జూ అధికారులు చెప్పారని తెలుస్తోంది.