ఇది ఓ పులి విరహ వేదన.. తోడును వెతుక్కుంటూ 2 వేల కి.మీ ప్రయాణం..
పక్షులు,కీటకాలు,జంతువులకు వలస అనేది సహజ లక్షణం. గుంపులు గుంపులుగా ప్రయాణిస్తూ వలస వెళ్లే సీతాకోక చిలుకలను మనం చాలాసార్లు చూసుంటాం. తీర ప్రాంతం వెంబడి మైళ్ల దూరం నడిచిపోయే పీతల గురించి కూడా విని ఉంటాం. వాతావరణ మార్పులు,ఆహారం,సంతానోత్పత్తి.. ఇలా పలు కారణాలతో పక్షులు, జంతువులు వలస వెళ్తాయన్న సంగతి తెలిసిందే. కానీ ఓ పులి ఆడ తొడు కోసం ఏకంగా 2వేల కి.మీ దూరం ప్రయాణించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
తిప్పేశ్వర్ నుంచి ధ్యాన్గంగాకు..
మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి బయలుదేరిన ఓ పులి తన తోడును వెతుక్కుంటూ 2వేల కి.మీ ప్రయాణించినట్టు ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్(IFS) పర్వీన్ కస్వాన్ ట్విట్టర్లో వెల్లడించారు. చివరగా అది ద్యాన్గంగా అటవీ ప్రాంతానికి చేరిందన్నారు. వాగులు,వంకలు,రోడ్లు,అడవులు,మైదానాలు దాటుకుంటూ.. అలుపెరగకుండా అది అంత దూరం చేరుకుందన్నారు. పగటిపూట పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ.. రాత్రివేళల్లో అది తన తోడును వెతుక్కుంటూ ప్రయాణించిందన్నారు.
అలా గుర్తించారు..
ఆ పులికి అమర్చిన వీహెచ్ఎఫ్ రేడియో & జీపీఎస్ నెట్వర్క్ ద్వారా ఈ సమాచారం అంతా తెలిసినట్టు చెప్పారు. పులి ఏయే మార్గాల ద్వారా ద్యాన్గంగాకు చేరింది.. ఆ మార్గంలో ఎక్కడెక్కడ ఆగింది వంటి వివరాలకు సంబంధించి మ్యాప్ను కూడా పర్వీన్ ట్విట్టర్లో షేర్ చేశారు. తిప్పేశ్వర్ అభయారణ్యంలో ఎంత వెతికినా దీనికి ఆడపులి తోడు దొరక్కపోవడంతోనే.. అక్కడి నుంచి అంత దూరం తోడును వెతుక్కుంటూ వెళ్లిందని చెబుతున్నారు.
ట్విట్టర్లో వైరల్..
పర్వీన్ ఆ పులి గురించి తన ట్విట్టర్లో షేర్ చేసిన కొద్దిసేపటికే అది వైరల్గా మారింది. చాలామంది నెటిజెన్స్ పులిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. దానికి దొరకబోయే ఆడపులి ఎంత అదృష్టవంతురాలో అని అభిప్రాయపడుతున్నారు. కొంతమంది ఆ పులి ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నారు. 2వేల కి.మీ సుదీర్ఘ దూరం నడిచిందంటే.. ఆ మార్గంలో ఆహారం,వేటగాళ్లు,ఇతరత్రా సమస్యలన్నింటిని అధిగమిస్తూ వెళ్లడం మామూలు విషయం కాదంటున్నారు. అందుకే దాన్ని హీరో పులి అని పొగిడేస్తున్నారు.
Recommended Video
నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్
అన్ని వేల కి.మీ దూరం ప్రయాణించింది సరే.. మరి ఇప్పుడు దానికి తోడు దొరికిందా లేదా అని నెటిజెన్స్ ఆసక్తిగా ప్రశ్నిస్తున్నారు. అసలు విషయం సస్పెన్స్ గానే మిగిలిపోయిందని కొంతమంది అభిప్రాయపడుతుంటే... మరికొంతమంది నెటిజెన్స్ మాత్రం ద్యాన్గంగా అభయారణ్యంలో పులుల సంఖ్య ఎక్కువగానే ఉందని.. కాబట్టి దానికి తోడు దొరుకుతుందని అంటున్నారు. కొంతమంది నెటిజెన్స్ 'పాపం దానికి కూడా టిండర్ లాంటి డేటింగ్ యాప్ ఉంటే బాగుండేది.. ఇంత దూరం నడవాల్సి వచ్చేది కాదు' అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా జూపార్కుల్లో ఉండే జంతువులకు అక్కడి అధికారులే తోడును తెచ్చి చేరుస్తారు. అటవీ ప్రాంతాల్లో అయితే వాటి తోడును అవి వెతుక్కోవాల్సిందే.