అరే బాబూ.. నేనింకా చావలేదు.. పుకార్లతో చంపేసినోళ్లకో దండం.. అమర్ సింగ్ ఆవేదన
ప్రాణాలతో ఉన్న ఏ మనిషికైనా.. ''నేనింకా బతికే ఉన్నాన్రా బాబు..''అని చెప్పుకోవాల్సి రావడం నిజంగా విషాదమే. సోషల్ మీడియా వ్యాప్తిలోకి వస్తున్నకొద్దీ ఫేక్ వార్తల జోరు పెరగడం.. తరచు ఎవరో ఒక సెలబ్రిటీ నెటిజన్ల చేతిలో చనిపోతుండటం.. బాధాకరం. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా తన చావు వార్తలు చదివి స్పందించిన సందర్భాలున్నాయి. ఇప్పుడాయన జిగ్రీ దోస్త, సమాజ్ వాదీ పార్టీ నేత అమర్ సింగ్ వంతు వచ్చింది..
ఒకదశలో దేశరాజకీయాల్లో చక్రం తిప్పి, అన్ని రాష్ట్రాల్లోనూ తనకంటూ సొంత ఇమేజ్ ఏర్పర్చుకున్న అమర్ సింగ్.. సమాజ్ వాదీ పార్టీలో తండ్రీకొడుకుల పంచాయితీ తర్వాత క్రమంగా కనుమరుగవుతూ వచ్చారు. లోక్ సభ ఎన్నికల తర్వాత పూర్తిగా కనిపించకుండా పోయిన ఆయనపై రెండ్రోజులుగా ఒక పుకారు వ్యాప్తిలోకి వచ్చింది. అమర్ సింగ్ యమధర్మరాజు దగ్గరికి వెళ్లిపోయాడంటూ యూపీ, ఢిల్లీలో వార్తలు గుప్పుమన్నాయి. అనారోగ్యానికి గురై, సింగపూర్ లో చికిత్స పొందుతోన్న ఆయన.. తన మరణవార్తలపై ఘాటుగా స్పందించారు. ''టైగర్ జిందా హై'' కామెంట్ తో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
''సింగపూర్ నుంచి అమర్ సింగ్ మాట్లాడుతున్నాను.. నేను అనారోగ్యానికి గురైన మాట వాస్తవమే.. కానీ ఇప్పుడు కోలుకున్నాను.. నాలో శక్తియుక్తులు, ఉత్సాహం చెక్కుచెదరకుండా ఉన్నాయి. కానీ కొందరు ప్రియమైన 'మిత్రులు' కొందరు నా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. నేను యమధర్మరాజు దగ్గరికి వెళ్లిపోయానంటూ పుకార్లు సృష్టించారు.. అరే బాబూ.. నేను ఇంకా బతికే ఉన్నాను.. చికిత్స కొనసాగుతోంది.. భగవంతుడి దయతో నేను తొందర్లోనే కొలుకుంటాను.. రెట్టించిన శక్తితో ఇండియాకు తిరిగొస్తాను.. ఎప్పటిలాగే కష్టమైనా సుఖమైనా మీతోనే గడుపుతాను..
నేను చనిపోయానంటూ పుకార్లు లేవదీస్తున్న మిత్రులకు ఒకటే చెప్పదల్చుకున్నా.. చాలా కాలంగా మృత్యుదేవత నా పక్కనే తిరుగుతోంది.. గతంలో విమాన ప్రమాదం లాంటి పెద్ద సంఘటనల్లో కూడా నేను ప్రాణాలతో బయటపడ్డాను.. ఓసారైతే వెంటిలేటర్ పై 13 రోజులు పోరాడిమరీ తిరిగొచ్చాను.. ఇప్పుడు కూడా అనారోగ్యం నుంచి కోలుకున్నాను.. ప్రస్తుతం భేషుగ్గా ఉన్నాను.. నా బ్రెయిన్ చిన్నపిల్లల మాదిరిగా చాలా యాక్టివ్ గా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.. ఇంతబాగున్నా నేను చనిపోయానంటూ ప్రచారం చేస్తున్నవాళ్లకు కోటి దండాలు తప్ప నేను ఇవ్వగలిగిందేమీ లేదు''అని అమర్ సింగ్ పేర్కొన్నారు.