యూపీలో దారుణం.. దాడి చేస్తోందని పులిని కొట్టి చంపిన జనం..
Recommended Video
ఫిలిబిత్ : ఉత్తర్ప్రదేశ్లో దారుణం జరిగింది. ఫిలిబిత్ జిల్లాల్లోని గ్రామస్థులు ఆడ పులిని కొట్టి చంపారు. ఫిలిబిత్ టైగర్ రిజర్వ్కు సమీపంలో ఉన్న మతైనా గ్రామంలో ఈ ఘటన జరిగింది. కర్రలతో పులిపై దాడి చేస్తున్న వీడియోకు సంబంధించి కామెంటరీతో కూడిన వీడియోను తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఘటన జరిగిన రోజు ఉదయం ఆ పులి తమ గ్రామస్థుడిపై దాడి చేసి గాయపరిచినందునే దాన్ని చంపుతున్నట్లు అందులో చెప్పారు.
గ్రామస్థుల దాడిలో చనిపోయిన పులి వయసు 6ఏళ్లని అటవీ శాఖ అధికారులు చెప్పారు. పక్కటెముకలు విరగడంతో పాటు బలమైన గాయాలు తగలడంతో అది చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్ట్ మార్టంలో అనంతరం కళేబరాన్ని సమాధి చేశారు. పులి హత్యకు సంబంధించి అటవీ అధికారులు 31మందిపై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.
పులిపై దాడి జరుగుతున్న సమయంలోనే ఫారిస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఆగ్రహంతో ఉన్న గ్రామస్థులు వారిని అడ్డుకున్నారు. కనీసం దాన్ని హాస్పిటల్కు తరలించేందుకు కూడా అనుమతించలేదు. దీంతో ఆ పులి స్పాట్ లోనే చనిపోయారు. ఘటనకు సంబంధించి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.
ఫిలిబిత్ జిల్లాలోని ఫిలిబిత్ టైగర్ రిజర్వ్లో 2012 నుంచి 16పులులు, 3 చిరుతలు అటవీ ప్రాంతంతో పాటు దాని పరిసర గ్రామాల్లో చనిపోయాయి. వాటిలో చాలా వరకు విషాహారం, ఉచ్చులో చిక్కుకోవడం, అంటువ్యాధుల కారణంగా చనిపోయినట్లు గుర్తించారు. అయితే గ్రామస్థుల దాడిలో పులి చనిపోయిన ఘటన ఇదే మొట్టమొదటిదని అధికారులు చెబుతున్నారు.