జైలు నుంచి పారిపోయేందుకు సూసైడ్ నాటకం!
ఢిల్లీ: జైలు నుంచి పారిపోయేందుకు ఓ ఖైదీ తీవ్రంగా ఆలోచించాడు. అతనికో కన్నింగ్ ఆలోచన వచ్చింది. దీంతో జైలు నుంచి పారిపోయేందుకు ఏకంగా ఆత్మహత్య నాటకం ఆడాడు. కానీ చివరకు తన ప్రయత్నం విఫలమై పోలీసులకు చిక్కాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని తిహార్ జైలులో అశ్వినీ అనే ఖైదీ శిక్ష అనుభవిస్తున్నాడు. జైలు నుంచి పారిపోయేందుకు అశ్వినీ శనివారం ఓ పథకం అమలు చేశాడు. ముందుగా జైలులో కొన్ని గాజు ముక్కలు తిని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు నటించాడు. దీన్ని గుర్తించిన పోలీసులు అతన్ని దీన్ దయాళ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
అనంతరం ఇద్దరు కానిస్టేబుళ్లను అశ్వినీ దగ్గర ఉంచి.. ఉన్నతాధికారులు డాక్టర్తో మాట్లాడటానికి వెళ్లారు. అప్పటిదాకా స్పృహాలో లేనట్లు నటించిన అశ్వినీ.. ఉన్నతాధికారులు వెళ్లిపోగానే ఆసుపత్రి కిటీకి నుంచి కిందికి దిగి పారిపోయేందుకు యత్నించాడు.
అయితే అక్కడే ఉన్న కొందరు ఆస్పత్రి సిబ్బంది ఇది గమనించి పోలీసులకు సమాచారమమిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఛేజ్ చేసి నిందితుడిని పట్టుకున్నారు. తిరిగి చికిత్స అందించి జైలుకు తరలించే ఏర్పాట్లు చేశారు. దీంతో ఆ దొంగ ఆశలు అడియాశలైపోయాయి.