నిర్భయ దోషుల ఉరిశిక్షకు ఏర్పాట్లు: ఇద్దరు తలారులు చాలు: వారిని పంపించండి: తీహార్ నుంచి ఆదేశం..!
న్యూఢిల్లీ: యావత్ దేశాన్ని వణికించిన నిర్భయ అత్యాచార ఉదంతంలో దోషులకు విధించిన ఉరిశిక్షను అమలు చేయడానికి ఏర్పాట్లు ఆరంభమైనట్లే కనిపిస్తోంది. నిర్భయ కేసులో ప్రస్తుతం జీవించి ఉన్న నలుగురికి ఈ నెల 16వ తేదీన తెల్లవారు జామున 5 గంటలకు ఉరి తీసే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. తీహార్ జైలు అధికారులు కీలక ఆదేశాలను జారీ చేశారు. ఇద్దరు తలారులను వెంటనే సిద్ధం చేసి, ఢిల్లీకి పంపించాలని ఉత్తర్ ప్రదేశ్ పోలీసు అధికారులకు సూచించారు.
ఎప్పుడు పిలిపించినా.. ఢిల్లీకి వచ్చేలా
ఈ విషయాన్ని ఉత్తర్ ప్రదేశ్ జైళ్ల శాఖ అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ ఆనంద్ కుమార్ వెల్లడించారు. గురువారం ఉదయం ఆయన లక్నోలో విలేకరులతో మాట్లాడారు. ఇద్దరు తలారులను వెంటనే సిద్ధం చేయాలని తీహార్ జైలు సూపరింటెండెంట్ నుంచి లిఖితపూరకమైన ఆదేశాలు అందినట్లు చెప్పారు. ఎప్పుడు పిలిపించినా అప్పటికప్పుడు ఢిల్లీకి బయలుదేరి వచ్చేలా ఆ ఇద్దరు తలారులకు ఆదేశాలు జారీ చేయాలని తీహార్ జైలు సూపరింటెండెంట్ సూచించినట్లు ఆనంద్ కుమార్ పేర్కొన్నారు.
ఉరిశిక్ష కోసమేననే అనుమానాలకు మరింత బలం..
దీనితో- నిర్భయ దోషులకు త్వరలోనే ఉరిశిక్షను అమలు చేసే అవకాశం ఉందంటూ వ్యక్తమౌతోన్న అనుమానాలకు మరింత బలాన్ని చేకూరినట్టయింది. 2012 డిసెంబర్ 16వ తేదీన రాత్రి వేళ.. కదులుతున్న బస్సులో ఆరుమంది కామాంధులు నిర్భయపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన నిర్భయ.. కన్నుమూశారు.
ఆ నలుగురూ తీహార్ లోనే..
ఈ ఘటన పట్ల యావత్ దేశం కదిలిపోయింది. నిందితులకు ఉరిశిక్ష విధించాలంటూ గళమెత్తింది. దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు వ్యక్తమయ్యాయి. ఈ కేసులో దోషులుగా తేలిన ఆరుమందిలో ఒకరు మైనర్ కావడంతో జువైనల్ హోంలో శిక్షను అనుభవించారు. రామ్ సింగ్ అనే దోషి.. కారాగారంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. పవన్ కుమార్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ ఠాకూర్, ముఖేష్ సింగ్ ప్రస్తుతం తీహార్ కేంద్ర కారాగారంలో ఉన్నారు.
అత్యాచారానికి పాల్పడిన తేదీ నాడే..
ఆ నలుగురినీ ఈ నెల 16వ తేదీన ఉరి తీసే అవకాశాలు ఉన్నాయంటూ కొద్దిరోజులుగా వార్తలు వెల్లువెత్తుతున్నాయి. నిర్భయపై అత్యాచారానికి పాల్పడిన తేదీ నాడే దోషులకు ఉరి శిక్ష విధించడానికి తీహార్ జైలు అధికారులు సన్నాహాలు చేస్తున్నారంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అదే సమయంలో- ఇద్దరు తలారులను సిద్ధం చేయాలంటూ తీహార్ జైలు సూపరింటెండెంట్ నుంచి ఉత్తర్ ప్రదేశ్ జైళ్ల శాఖ కార్యాలయానికి లిఖితపూరక ఆదేశాలు అందడం ప్రాధాన్యతను సంతరించుకుంది.