దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్ బిగిన్స్: ప్రధాని మోడీ చెప్పిన నాలుగు టిప్స్..పాటిద్దాం
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా టీకా ఉత్సవం (Tika Utsav) కార్యక్రమాన్ని ప్రారంభించింది. నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్ది సేపటి కిందటే దేశ ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. టీకా ఉత్సవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి, వ్యాక్సిన్ వేడుకలను విజయవంతం చేయడానికి ఆయన నాలుగు టిప్స్ చెప్పారు.
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. కొత్తగా 1,52,879 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు లక్షన్నర మార్క్ను దాటడం ఇదే తొలిసారి. ఒకవంక వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతున్నప్పటికీ.. అదే సమయంలో వైరస్ సైతం పంజా విసురుతోంది. మాస్క్లను ధరించకపోవడం, భౌతిక దూరాన్ని పాటించకపోవడం వంటి కారణాల వల్ల వైరస్ కేసులు పెరుగుతున్నాయనేది తెలిసిన విషయమే.
ఈ పరిస్థితుల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం టీకా ఉత్సవ్ను చేపట్టింది. ఈ నెల 14వ తేదీ వరకు ఇది కొనసాగుతుంది. దీన్ని విజయవంతం చేయాలని ప్రధాని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. తమ తోటి వారు వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రోత్సహించాలని కోరారు. కరోనా వైరస్ బారిన పడి ఐసొలేషన్ కేంద్రాలు, కోవిడ్ సెంటర్లలో చికిత్స పొందుతున్న వారికి సహకరించాలని అన్నారు. వ్యాక్సిన్పై అవగాహన కల్పించాలని చెప్పారు.
Recommended Video
ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. వాటిని ధరించేలా తమ తోటి వారిలో స్ఫూర్తినింపాలని చెప్పారు. తాము నివసించే ప్రాంతాల్లో ఎవరైనా కరోనా వైరస్ బారిన పడితే.. అది మరింత వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని చెప్పారు. సదరు ప్రదేశాన్ని మైక్రో కంటైన్మెంట్ జోన్గా క్రియేట్ చేయాలని అన్నారు. మాస్కులను ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా కరోనా వైరస్ను తమ దరికి చేరకుండా జాగ్రత్త పడొచ్చని చెప్పారు.