దారుణం : టిక్టాక్ సెలబ్రిటీని చంపేశారు..!
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. రద్దీ ప్రాంతంలో ముగ్గురు దుండగులు రెచ్చిపోయారు. అందరూ చూస్తుండగానే ఓ యువకున్ని తుపాకీతో కాల్చి చంపారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. డబ్బు విషయంలో జరిగిన గొడవ కారణంగానే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. మర్డర్కు సంబంధించి కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
పాకిస్తాన్ బోట్లో డ్రగ్స్.. 600 కోట్ల రూపాయల హెరాయిన్ సీజ్
టిక్ టాక్ సెలబ్రిటీ
ఢిల్లీకి చెందిన 24 ఏళ్ల మోహిత్ మోర్ ఫిట్నెస్ ఫ్రీక్. టిక్ టాక్తో పాటు ఇన్స్టాగ్రామ్లో తరుచూ ఫిట్నెస్కు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తుండేవాడు. దాదాపు 5లక్షల మంది ఫాలోవర్లున్న మోహిత్ టిక్ టాక్ సెలబ్రిటీగా పేరు తెచ్చుకున్నాడు. ఇన్స్టాగ్రామ్లోనూ ఆయనకు భారీ సంఖ్యలోనే అభిమానులున్నారు. నజఫ్గఢ్లోని జిమ్కు వెళ్లే మోహిత్ మంగళవారం జిమ్ చేసి ఓ ఫ్రెండ్ను కలిసేందుకు వెళ్లిన సమయంలో ఈ దారుణం జరిగింది.
ఫ్రెండ్తో మాట్లాడుతుండగా..
మంగళవారం సాయంత్రం 5గంటల సమయంలో ఫ్రెండ్ను కలిసేందుకు వెళ్లిన మోహిత్ ఓ జిరాక్స్ సెంటర్ వద్ద కూర్చుని ఉన్నాడు. ఇంతలో బైక్పై అక్కడకు వచ్చిన ముగ్గురు దుండగులు సోఫాలో కూర్చుని ఉన్న మోహిత్పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దాదాపు 13 రౌండ్లు కాల్పులు జరపడంతో మోహిత్ అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే తేరుకున్న స్థానికులు మోహిత్ను దగ్గరలోని హాస్పిటల్కు తరలించగా.. చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. పోలీసులు మాత్రం అతని శరీరంలోకి ఐదు బుల్లెట్లు దూసుకెళ్లినట్లు చెబుతున్నారు.
సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు
మోహిత్ మోర్ హత్యకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యారు. బైక్పై వచ్చిన ముగ్గురు దుండగులు ఈ దారుణానికి పాల్పడినట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. నిందితుల్లో ఇద్దరు హెల్మెట్ పెట్టుకుని ఉండగా... మరొకడి ముఖం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
హత్యకు దారితీసిన కారణాలపై ఆరా
మోహిత్ హత్యకు దారితీసిన కారణాలపై పోలుసులు ఆరా తీసుకున్నారు. మృతుడి టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లతో పాటు కాల్ డేటా రికార్డులను పరిశీలిస్తున్నారు. గ్యాంగ్వార్ కారణంగా హత్య జరిగిందా లేక టిక్ టాక్ వీడియోల కారణంగా ఎవరైనా శతృత్వం పెంచుకున్నారా అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డబ్బు విషయంలో నెలకొన్న వివాదమే హత్యకు దారితీసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.