టిక్ టాక్ కు మరో ఝలక్.. కోర్టుకెళ్లకముందే.. ఉద్యోగులకు సీఈవో కీలక సందేశం..
భారత ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ న్యాయపోరాటానికి సిద్ధమైన చైనీస్ సంస్థ టిక్ టాక్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తమ తరఫున వాదించాలంటూ టిక్ టాక్ యాజమాన్యం చేసిన విజ్ఞప్తిని ప్రముఖ లాయర్, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ తోసిపుచ్చారు. చైనా కంపెనీకి అనుకూలంగా.. అది కూడా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను వాదించబోనని ఆయన స్పష్టం చేశారు. దీంతో సంస్థ మరో న్యాయవాదిని వెతుక్కునే పనిలో పడింది. మరోవైపు, టిక్ టాక్ సీఈవో, దాని మాతృసంస్థ బైట్ డ్యాన్స్ సీవోవో అయిన కెవిన్ మేయర్.. ఇండియాలోని తమ ఉద్యోగులకు బుధవారం కీలక సందేశం పంపారు.
గాల్వాన్లో చైనాకు భారీ షాక్.. కృత్రిమ నిర్మాణాలపై ప్రకృతి ప్రకోపం.. చర్చల్లో అసాధారణ ప్రతిపాదన..
ఇంటర్నెట్ లో ప్రజాస్వామ్యాన్ని మరింతగా పెంపొందించాలన్న తమ నిబద్ధతకు కట్టుబడే ఉంటామని, ఉద్యోగుల కృషి వల్లే ఇండియాలో టిక్ టాక్ సూపర్ హిట్ అయిందని, 20 కోట్ల మంది యూజర్లు తమ క్రియేటివిటీని ప్రపంచానికి చాటుకునే గొప్ప అవకాశం టిక్ టాక్ ద్వారా లభించిందని సంస్థ సీఈవో కెవెన్ మేయర్ పేర్కొన్నారు. నిషేధం విషయంలో ఉద్యోగులెవరూ హైరానా పడొద్దని, చట్టపరంగా సమస్యను పరిష్కరించుకోడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.
''భారత్ లో కార్యకలాపాల విషయంలో ఇక్కడి చట్టాలను తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చాం. యూజర్ల ప్రైవసీ, ఇంటిగ్రిటీకి అధిక ప్రాధాన్యం ఇచ్చాం. తాజాగా తలెత్తిన సమస్యల్ని పరిష్కరించుకునే దిశగా సంబంధిత వ్యవస్థలతో సంప్రదింపులు, చర్చలు చేస్తున్నాం. అదే సమయంలో ఉద్యోగుల జాబ్ సెక్యూరిటీకి కూడా టిక్ టాక్ ప్రాధాన్యం ఇస్తుందని మరోసారి గుర్తుచేస్తున్నాను. డిజిటల్ ఇండియాలో చురుకైన పాత్ర పోషిస్తోన్న సంస్థగా మనకు రాబోయే రోజుల్లో అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తున్నా..'' అంటూ కెవెన్ టిక్ టాక్ ఉద్యోగులకు భరోసా ఇచ్చారు.
డేటా చౌర్యం, దేశ భద్రతకు ముప్పు కలిగించే రీతో కార్యకలాపాలకు పాల్పడిన ఆరోపణలపై టిక్ టాక్ సహా 59 చైనీస్ యాప్ లను భారత ప్రభుత్వం నిషేధించింది. ఐటీ చట్టంలోని 69ఏ సెక్షన్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఐటీ శాఖ తెలిపింది. భారత సర్కారు నిర్ణయాన్ని కోర్టుల్లో సవాలు చేసేందుకు టిక్ టాక్ తోపాటు ఇతర కంపెనీలూ సమాయత్తం అవుతున్నాయి.