భయ్యా టిక్ టాక్ మళ్లీ వచ్చేసింది భయ్యా
ఢిల్లీ : చైనీస్ యాప్ టిక్ టాక్ మళ్లీ వచ్చేసింది. ఇండియాలో గూగుల్ ప్లే స్టోర్తో పాటు యాపిల్ యాప్ స్టోర్లో అందుబాటులోకి తెచ్చాయి. మద్రాస్ హైకోర్టు నిషేధం నేపథ్యంలో 15 రోజులుగా ఈ యాప్ అందుబాటులో లేకుండా పోయింది. గతవారం కొన్ని షరతులతో మద్రాస్ హైకోర్టు నిషేధం ఎత్తివేసింది. కోర్టు ఆదేశాలు జారీ చేసిన వారం రోజుల అనంతరం టిక్ టాక్ యాప్ను మళ్లీ అందుబాటులోకి తెచ్చారు.
యూజర్లకు గుడ్న్యూస్ : టిక్ టాక్ యాప్ బ్యాన్ ఎత్తివేత
తమలోని క్రియేటవిటీని బయటి ప్రపంచానికి పరిచయం చేసేందుకు టిక్ టాక్ ఉపయోగపడింది. అయితే ఈ యాప్ యువతను తప్పుదారి పట్టిస్తోందని, ఆశ్లీలతను పెంచడంతో పాటు విద్వేషాలు రెచ్చగొడుతోందంటూ మధురైకి చెందిన ముత్తు కుమార్ అనే న్యాయవాది మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం టిక్ టాక్ను బ్యాన్ చేస్తూ తీర్పు చెప్పింది.
మద్రాస్ హైకోర్టు తీర్పుపై టిక్ టాక్ ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే నిషేధం ఎత్తివేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం తొలుత నిరాకరించింది. అనంతరం మద్రాస్ హైకోర్టు నిషేధం విషయంలో నిర్ణయం తీసుకోకపోతే బ్యాన్ ఎత్తివేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో మధురై ధర్మాసనం గతవారం కొన్ని షరతులు విధిస్తూ టిక్ టాక్ యాప్పై నిషేధం ఎత్తివేసింది.