ఓరి ఈడి ఏషాలో : పగలు టిక్టాక్ వీడియోలు.. రాత్రికి...
ముంబై : అతనో టిక్టాక్ సెలబ్రిటీ. 9 లక్షల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. రోజు కనీసం ఒక్క వీడియోనైనా అప్లోడ్ చేస్తాడు. అంతటి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఇప్పుడు జైలు పాలయ్యాడు. అందుకు కారణం తెలిసిన అభిమానులు షాకయ్యారు. ఇంతకీ మనోడు కటకటాలు లెక్కపెట్టేందుకు కారణమేంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి.
ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు.. ఒకే ముహుర్తానికి ప్రియున్ని పెళ్లాడిన యువతులు..
టిక్టాక్ స్టార్ అభిమన్యు
అభిమన్యు గుప్తా. ముంబై కుర్లాలోని బెయిల్ బజార్లో ఉంటాడు. అతనికి టిక్టాక్ అంటే పిచ్చి. రోజులో కనీసం ఒక్క వీడియో అయినా అప్లోడ్ చేయనిదే నిద్రపట్టేది కాదు. ఆయన చేసే షార్ట్ వీడియోలు చూసి 9లక్షలకుపైగా అభిమానులు అతని ఫాలోవర్లుగా మారారు. ఇంత వరకు బాగానే ఉన్నా మనోడిలో నటనతో పాటు మరో కళ దాగి ఉందన్న విషయం చాలాకాలం వరకు ఎవరికీ తెలియదు.
పగలు వీడియోలు.. రాత్రి చోరీలు
పగటిపూట టిక్టాక్ వీడియోలు చేసి ఫాలోవర్లను అలరించే అభిమన్యు రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతుండేవాడు. ఇళ్లకు కన్నం వేస్తూ అందినకాడికి దోచుకుపోయేవాడు. ఇప్పటి వరకు అతనిపై ఐదు దొంగతనం కేసులు నమోదయ్యాయి. అయితే ఏ కేసులోనూ పక్కా ఆధారాలు లభించకపోవడంతో ఇంత వరకు పోలీసులకు పట్టుబడలేదు.
అభిమన్యును పట్టిచ్చిన సీసీ టీవీ ఫుటేజ్
ఈ ఏడాది జనవరి 19న అభిమన్యు గుప్తా ఎప్పటిలాగే తన చోర కళను ప్రదర్శించాడు. ఓ వృద్ధ జంట ఇంట్లోకి ప్రవేశించి 150గ్రాముల బంగారం, మొబైల్ ఫోన్ సహా మొత్తం రూ.4.75లక్షల విలువైన సొత్తు దోచుకుపోయాడు. దీనిపై బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. చోరీ జరిగిన ప్రాంతానికి వెళ్లి అక్కడున్న సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలించారు. అయితే అందులో దొంగ ముఖం స్పష్టంగా కనిపించలేదు. వీడియోను మరింత నిశితంగా పరిశీలించగా.. నిందితుడు అభిమన్యు అని తేలింది. గత నెల 28న కుర్లాలో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
పోలీసు మర్యాదతో బయటపెట్టిన నిజం
పోలీసుల విచారణలో మొదట అభిమన్యు తాను దొంగతనం చేయలేదని బుకాయించాడు. అయితే పోలీసులు మర్యాద చేయడంతో అసలు విషయం బయటపెట్టాడు. చోరీలు చేసింది తానేనని, ఆ సొమ్మును స్నేహితుని వద్ద దాచానని చెప్పాడు. దీంతో పోలీసులు అతని స్నేహితుడి నుంచి బంగారం, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తన భార్య నగలని చెప్పి తనవద్ద భద్రపరిచాడని అభిమన్యు స్నేహితుడు చెప్పడం విశేషం.