టిక్టాక్ స్టార్ పూజ ఆత్మహత్య కేసు: శివసేన మంత్రి సంజయ్ రాజీనామా
ముంబై: టిక్టాక్ స్టార్ పూజ చవాన్(22) ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర అటవీశాఖ మంత్రి, శివసేన ఎమ్మెల్యే సంజయ్ రాథోడ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అనంతరం తన రాజీనామా నిర్ణయాన్ని ఆదివారం ప్రకటించారు.
ఫిబ్రవరి 8న అనుమానాస్పదస్థితిలో మరణించిన టిక్టాక్ స్టార్ పూజ చవాన్ కేసులో సంజయ్ పేరు రాథోడ్ పేరు వెలుగులోకి వచ్చింది. ఆమెతో మంత్రి ఉన్న ఫొటోలు, ఆడియో, వీడియో క్లిప్స్ బయటకు రావడంతో విపక్షాలు భారీ ఎత్తున ఆందోళన చేపట్టాయి. మంత్రి రాజీనామాకు డిమాండ్ చేశాయి.
ఈ నేపథ్యంలోనే సంజయ్ రాథోడ్ తన భార్యతో కలిసి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో సమావేశమయ్యారు. అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడారు. మహిళ మరణాన్ని రాజకీయ చేస్తున్నారని అన్నారు. విచారణ పారదర్శకంగా జరగాలన్న ఉద్దేశంతోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విదర్భ ప్రాంతం నుంచి సంజయ్ రాథోడ్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
గత 30ఏళ్లుగా అనేక సామాజిక కార్యక్రమాల ద్వారా పొందిన పేరును, రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకే ఈ కుట్ర పన్నారని సంజయ్ ఆరోపించారు. కాగా, సంజయ్ రాథోడ్ కేవలం మంత్రి పదవికి రాజీనామా చేస్తే సరిపోదని, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ప్రతిపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్ చేశారు. సంజయ్ రాథోడ్పై చర్యలకు డిమాండ్ చేస్తూ బీజేపీ మహిళా నేతలు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. కాగా, తమ మంత్రిపై ఆరోపణలు, ఆందోళనలు చేయడంపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే విపక్షాలపై మండిపడ్డారు.