'సోనియా, రాహుల్ ఇటలీ వెళ్లే సమయమొచ్చింది'
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు సాక్షి మహారాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీలు తిరిగి ఇటలీకి వెళ్లే సమయం వచ్చిందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
లలిత్ మోడీ వ్యవహారంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్తో రాహుల్ గాంధీ చర్చకు రావాలని సవాల్ చేశారు. సాక్షి మహారాజ్ తన వ్యాఖ్యలతో పలుమార్లు కలకలం రేపిన విషయం తెలిసిందే.
గతంలో పలుమార్లు ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓసారి మాట్లాడుతూ.. తనను తాను అసలైన ముస్లీంగా చెప్పారు. మహమ్మద్ ప్రవక్త గొప్ప యోగి అన్నారు. ప్రవక్త గొప్ప యోగా నిపుణులని భావిస్తున్నానని చెప్పారు. సూర్యుడు లేకపోతే ఎవరూ బతకలేరని, సూర్యుడికి మతతత్వం ఆపాదించేవాళ్లు సూర్యకాంతిని గ్రహించడం ఆపేయాలని వ్యాఖ్యానించారు.
అంతకుముందు ఓసారి మాట్లాడుతూ... ‘రాహుల్ గాంధీ ఓ పిచ్చోడు. రాజకీయాల్లో ఆయనకు ఏబీసీడీలు కూడా తెలియవు. గోధుమలు.. మొక్కజొన్నకు తేడా తెలియదు కానీ.. ఆయన రైతుల గురించి మాట్లాడుతున్నారు' అని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోలీ రత్నాపూర్ అనే గ్రామంలో జరిగిన ఓ సభలో విమర్శించారు.
మరో సందర్భంలో రాహుల్ గాంధీ నేపాల్ పర్యటన వల్లనే అక్కడ భూకంపం వచ్చిందన్నారు. అంతకుముందు ఓసారి మాట్లాడుతూ.. పిల్లలను కనడంపై పరిమితులు విధించాలని, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయంచుకున్న వారికే ఓటు హక్కు కల్పించాలన్నారు.