ఢిల్లీ రీఓపెన్ చేయాల్సిన టైమొచ్చింది: సీఎం కేజ్రీవాల్, కొత్త నిబంధనల ప్రకటన
న్యూఢిల్లీ: ఢిల్లీని తిరిగి తెరిచేందుకు సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. దేశ రాజధాని ఢిల్లీలో కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో దశల వారీగా లాక్డౌన్ తొలగించనున్నట్లు తెలిపారు. కరోనా నియంత్రణకు మార్చి 24న లాక్డౌన్ విధించాలన్న కేంద్రం నిర్ణయం ఎంతో ముఖ్యమైందని, ఒక వేళ దేశంలో లాక్డౌన్ విధించకుంటే పరిస్థితి మరింత ప్రమాదకరస్థాయిలో ఉండేదని అన్నారు.
Recommended Video
ఆ పరిస్థితి లేదు..
అయితే, మరింత కాలం లాక్డౌన్ పొడిగించే పరిస్థితి లేదని, గతేడాది ఏప్రిల్ నెలలో రూ. 3500 కోట్ల ఉన్న ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది రూ. 300 కోట్లకు పడిపోయిందని తెలిపారు. ఎక్కువ కాలం లాక్డౌన్ కొనసాగితే ఆర్థిక పరిస్థితి దిగజారే ప్రమాదం ఉందని, ప్రభుత్వం పనిచేయడం కూడా కష్టమవుతుందని తెలిపారు. అందుకోసమే లాక్ డౌన్ నిబంధనలు సడలించనున్నట్లు చెప్పారు.
ఢిల్లీ తెరిచే సమయం..
కంటైన్మెంట్ జోన్లు పూర్తి మూసేయాలని, గ్రీన్ జోన్ ప్రాంతాల్లో దుకాణాలు సరి, బేసి విధానంలో తెరిచేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఢిల్లీని తిరిగి తెరిచేందుకు సమయం ఆసన్నమైందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత కేసులు నమోదైనా ఆ పరిస్థితి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రైమరీ సంస్థలు 33 శాతం ఉద్యోగులతో కార్యకలాపాలు సాగించుకోవచ్చని, ప్రముఖ మార్కెట్ ప్రాంతాలైన కన్నాట్ ప్లేస్, ఖాన్ మార్కెట్ ఏరియాల్లో నిత్యావసర దుకాణాలు తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు.
నిబంధనలు పాటించాల్సిందే..
అంతేగాక, చేతి వృత్తులవారు తమ పనులు చేసుకోవచ్చని చెప్పారు. ఈ కామర్స్ సంస్థలకు నిత్యావసర డెలివరికీ మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ రవాణా మూసి ఉంటుందని, ప్రైవేటు వాహనదారులు డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు ప్రయాణించవచ్చని తెలిపారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ రవాణా, మాల్స్, మార్కెట్లు, సినిమా హాళ్లు, జిమ్ లు, స్విమ్మింగ్ ఫూల్స్, ప్రార్థన స్థలాలు ఎప్పటిలాగే మూసివుంచాలని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఢిల్లీలో 4వేల దాటిన కరోనా కేసులు
ఇక వివాహాలకు 50 మంది, అంతిమ సంస్కారాలకు 20 మంది కంటే ఎక్కువ మందిని అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో సామాజిక దూరం తప్పనిసరి అని తెలిపారు. 65ఏళ్ల పైబడివారు, 10ఏళ్లలోపువారు, గర్భిణీ స్త్రీలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాకూడదని సూచించారు. కాగా, ఢిల్లీలో ఇప్పటి వరకు 4122 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1256 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 2802 మంది చికిత్స తీసుకుంటున్నారు. 64 మంది కరోనాబారినపడి చనిపోయారు.