దినకరన్ దగ్గర్లో జైలుకు పోతాడు: పోయేకాలం దగ్గర పడింది: పళని, పన్నీర్, ప్రభుత్వం!
చెన్నై: టీటీవీ దినకరన్ దగ్గర్లో జైలుకు వెలుతాడని, పోయేకాలం దగ్గరపడి ఇలా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని తమిళనాడు మత్స్యశాఖ మంత్రి డి. జయకుమార్ మండిపడ్డారు. టీటీవీ దినకరన్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదని, పిచ్చాసుపత్రిలో చూపించుకుంటే మంచిదని మంత్రి జయకుమార్ సూచించారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వం ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని మంత్రి జయకుమార్ ధీమా వ్యక్తం చేశారు.
చెన్నై మెరీనా బీచ్
మంగళవారం చెన్నైలోని మెరీనా బీచ్ లోని స్వాతంత్రపోరాటయోదుడు నేతాజి సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి నివాళులు అర్పించిన మంత్రి జయకుమార్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశం కోసం ప్రాణాలు అర్పించారని మంత్రి జయకుమార్ గుర్తు చేశారు.
అమ్మ ఆశయాలు
తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చిన జయలలిత పేదప్రజలకు ఎంతో సేవ చెయ్యాలని ప్రయత్నించారని మంత్రి జయకుమార్ అన్నారు. అయితే అమ్మ తన ఆశయాలు పూర్తి చెయ్యకుండానే అందరికీ దూరం అయ్యారని మంత్రి జయకుమార్ విచారం వ్యక్తం చేశారు.
శత్రువులు పెరిగారు
అమ్మ అధికారంలోకి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చడానికి కొందరు శత్రువులతో చేతులు కలిపి కూల్చడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి జయకుమార్ ఆరోపించారు. అమ్మ ప్రభుత్వాన్ని కూల్చితే ప్రజలే మిమ్మల్ని తరిమితరిమి కొడతారని మంత్రి జయకుమార్ టీటీవీ దినకరన్ ను హెచ్చరించారు.
పళని, పన్నీర్ ప్రభుత్వం!
పళనిస్వామి, పన్నీర్ సెల్వం నేతృత్వంలోని ప్రభుత్వం తమిళనాడు ప్రజల సమస్యలు తీర్చుతున్నదని, అమ్మ అశయాలు ముందుకు కొనసాగించడానికి ఇద్దరూ శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారని మంత్రి జయకుమార్ వివరించారు.
టీటీవీ దినకరన్ జైలుకు!
టీటీవీ దినకరన్ మీద అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని, త్వరలోనే జైలుకు వెళ్లడానికి ఆయన సిద్దంగా ఉండాలని మంత్రి జయకుమార్ అన్నారు. ఇలాంటి క్రిమినల్స్ జైల్లో ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతోందని, అనవసరంగా ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తే మంచిదికాదని మంత్రి జయకుమార్ టీటీవీ దినకరన్ ను హెచ్చరించారు.