టైమ్ ప్రభావశీలురు: ప్రియాంక, సానియా, పిచాయి
న్యూయార్క్: ప్రఖ్యాత టైమ్ మేగజైన్ ప్రకటించిన '100 మంది ప్రపంచ అత్యంత ప్రభావశీలుర' జాబితాలో పలువురు భారతీయ ప్రముఖులు చోటు దక్కించుకున్నారు. ఇటీవలే ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ అందుకున్న టెన్నిస్ తార సానియా మీర్జా తోపాటు ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్లకు జాబితాలో చోటు దక్కింది.
ఇంకా, వీరితోపాటు సామాజిక ఉద్యమకారిణి సునీత నరైన్, ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకులు బిన్నీ బన్సాల్, సచిన్ బన్సాల్లు ఈ జాబితాలో ఉన్నారు. ఈమేరకు టైమ్ వార్షిక జాబితాను గురువారం విడుదల చేసింది. ఆర్థిక రంగాన్ని ముందే అంచనావేయగల ప్రతిభాశీలిగా రఘురామ్ రాజన్ను టైమ్ కొనియాడింది.
ప్రియాంక చోప్రా కూడా ఇటీవలే పద్మశ్రీ అందుకున్నారు. టైమ్ జాబితాలో భారత సంతతికి చెందిన నటుడు అజీజ్ అన్సారీ, లాస్ట్ మైల్ హెల్త్ సంస్థ సీఈవో రాజ్ పంజాబీ కూడా ఉన్నారు.
ఇది ఇలా ఉండగా, అంతర్జాతీయ ప్రముఖుల్లో.. పోప్ ఫ్రాన్సిస్, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్, ఆయన సతీమణి ప్రిసిల్లా చాను, రష్యా, అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, బరాక్ ఒబామా, ఫ్రాన్స్వో హోలన్లతో పాటు ఆంగ్సాన్ సూకీ, హిల్లరీ క్లింటన్ తదితరులున్నారు.
ప్రఖ్యాత అమెరికన్ సంగీత దర్శకుడు లిన్ మాన్యువల్-మిరండా, ఐఎంఎఫ్ అధిపతి క్రిస్టైన్ లగార్డే, ఆస్కార్ విజేత లియనార్డో డికాప్రియో తదితరులు టైమ్ జాబితాలో ఉన్నారు.