గుడ్బై చెప్పే టైమొచ్చింది!: తేల్చేసిన అల్కా లంబా, కాంగ్రెస్ గూటికే!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అసంతృప్త ఎమ్మెల్యే అల్కా లంబా ఎట్టకేలకు పార్టీ మార్పుపై స్పష్టతనిచ్చారు. శుక్రవారం తన ట్విట్టర్ ఖాతాలో 'ఇట్ టైమ్ టు సే గుడ్ బై'పార్టీకి గుడ్ బై చెప్పేందుకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు.
గుడ్బై చెప్పే సమయం
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిన సమయం వచ్చిందని.. గత ఆరేళ్లలో తన ప్రయాణం తనకు ఎన్నో పాఠాలను నేర్పిందని తెలిపారు. అందరికీ కృతజ్ఞతలంటూ సందేశాన్ని ముగించారు.
రాజీనామా చేస్తానంటూ..
తాను ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేస్తానని, వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని గత ఆదివారం అల్కా లంబా వ్యాఖ్యానించారు. కాగా, ఆమె రాజీనామా చేస్తే వెంటనే అంగీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆమ్ ఆద్మీ పార్టీ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేయడం గమనార్హం.
ఎప్పుడు రాజీనామా చేసినా..
అంతేగాక, అల్కా లంబా చాలా సార్లు పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పారని, అయితే ఇప్పటివరకు కూడా చేయలేదని ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ఎద్దేవా చేశారు. ఒక్క నిమిషంలో రాజీనామా చేసి పంపిస్తే.. తాము వెంటనే అంగీకరిస్తామని అన్నారు. తనను పార్టీ చాలా సార్లు అవమానించిందని అందుకే పార్టీని వీడేందుకు సిద్ధమయ్యానని అల్కా తెలిపారు. అంతేగాక, తాజాగా, మీ అధికార ప్రతినిధి మీ అండతోనే రెచ్చిపోతున్నారని, తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని అరవింద్ కేజ్రీవాల్ కు ట్వీట్ చేశారు అల్కా లాంబా.
పార్టీకి వ్యతిరేకంగా..
లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీపార్టీ ఘోర ఓటమి తర్వాత ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంజాయిషీ ఇవ్వాలని అల్కా లంబా డిమాండ్ చేశారు. దీంతో ఆమెను ఆమ్ ఆద్మీ పార్టీ అధికారిక శాసనసభ్యుల గ్రూప్ నుంచి తొలగించారు. కాగా, లోక్సభ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం కూడా చేయలేదు అల్కా లంబా. రాజీవ్ గాంధీకి భారతరత్న ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆప్ చేసిన తీర్మానాన్ని అల్కా సమర్థించలేదు. పార్టీ ఎలాంటి చర్యలు తీసుకున్నా తాను సిద్ధమేనని ప్రకటించారు.
సోనియాతో భేటీ..
కాగా, తన నియోజకవర్గంలోని ప్రజలు, కార్యర్తలతో జనసభ ద్వారా మాట్లాడిన తర్వాత పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటానని చాందినీచౌక్ ఎమ్మెల్యే అల్కా లంబా ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే మూడ్రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని అల్కా లంబా కలిశారు. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తేలిపోయింది.