దేశం కోసం జై జవాన్ అనలేమా ? ప్రాణాలర్పిస్తున్న జవాన్ల స్ఫూర్తి మనకు లేదా?
దేశం కోసం జై జవాన్ అనలేమా ? వీర మరణం పొందిన జవాన్లు , వారి తల్లిదండ్రుల స్ఫూర్తి మనలో లేదా ? భరతమాత ముద్దుబిడ్డలుగా దేశం కోసం మనమేం చేస్తున్నాం? బోర్డర్లో ప్రాణాలతో చెలగాటమాడుతున్న జవాన్లకు నివాళులర్పించడం తప్ప.ఈ ప్రశ్న వేసుకుంటే ప్రతి ఒక్కరిలోనూ దేశ రక్షణకు మన బిడ్డలను ఎందుకు పంపించలేకపోతున్నామన్న భావన కలగకమానదు. ఒక దేశం ప్రశాంతంగా ఉండాలంటే జై జవాన్ , జై కిసాన్ అన్న నినాదం నిజం కావాలి. కానీ ఆ దిశగా ఆలోచిస్తే దేశం సుభిక్షంగా , సురక్షితంగా ఉంటుంది అనటం నిస్సందేహం .
గాల్వన్ వ్యాలీలో అసలేం జరిగింది... ఎందుకీ ఘర్షణలు.. భారత సైనికులను చైనా వేటాడి మరీ...
పంజాబ్ వంటి రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఆర్మీలోకి
పంజాబ్ నుంచి సైన్యంలో చేరే వారి సంఖ్య చాలా ఎక్కువ. సైన్యంలో పనిచేస్తే ఎక్కడ తమ పిల్లల ప్రాణాలు పోతాయో అన్న భయం చాలా మంది తల్లిదండ్రులకు ఉంటుంది. ఇక అంతేకాదు ఆర్మీలో పని చేసేవారికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి పిల్లనిచ్చి పెళ్ళి చేయాలన్న చాలామంది ఆలోచిస్తారు. ఇక ఇంతవరకు పిల్లలు చదివి ప్రయోజకులై విదేశాల్లో ఉద్యోగాలు చెయ్యాలి అనుకునే వారే తప్ప సైన్యంలోకి పంపాలి అనుకునే వారు చాలా తక్కువ . సైన్యంలోకి వెళ్తే ఎప్పుడు ఏం అవుతుందో అన్న భయాలను, ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న అనుమానాలను పక్కన పెట్టాల్సిన పరిస్థితి.
మరణం ఎవరికైనా తప్పదు ..దేశం కోసం పని చెయ్యటంలోనే గొప్పతనం
భరతమాత ముద్దు బిడ్డలుగా పుట్టిన తర్వాత దేశం కోసం పని చేయాలన్న తపన ప్రతి ఒక్కరిలో ఉండాల్సిన అవసరం ఉంది. మనిషిగా పుట్టిన వారు ఎప్పుడో ఒకసారి మరణించక తప్పదు.తప్పనిసరిగా వచ్చే మరణం కోసం ఆర్మీలోకి పంపిస్తేనే ఏదో జరుగుతుందంటూ బాధ పడడం అర్ధరహితం. కానీ సైన్యంలో పనిచేస్తే దేశం కోసం పని చేసిన ఒక గొప్ప భావన మనకు కలుగుతుంది. ఇక అలాంటి భావనతోనే ప్రస్తుతం కల్నల్ సంతోష్ బాబు తల్లిదండ్రులు ఉన్నారు. వారు మాట్లాడుతూ ఉంటే వారిలో ఉన్న స్ఫూర్తి మనకు ఎందుకు లేదు అన్న ప్రశ్న ఖచ్చితంగా ఉత్పన్నమవుతోంది. అలాంటి తల్లిదండ్రులు ఉండే వరకే, ఇలాంటి జవాన్లు దేశం కోసం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి వీరోచితంగా పోరాడుతున్నారు.
వీరులారా వందనం అంటే సరిపోతుందా ? స్ఫూర్తి మనలో లేదు ఎందుకు ?
భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో వీరులైన వారందరికీ వందనం అంటూ దేశం నినదిస్తోంది. గాల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో సుమారు 20 మంది భారత జవాన్లు మృతి చెందారు. ఇక వారి మృతిపై దేశం అంతా ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేసినా దేశం కోసం వారు చేసిన త్యాగానికి వీరులారా వందనం అంటూ జోహార్లు అర్పిస్తున్నారు . కానీ వారిని సైన్యంలోకి పంపటానికి వారి తల్లిదండ్రులు చూపించిన స్ఫూర్తి మనలో చాలా మందికి లేకపోవటం గమనార్హం. ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి ప్రజ్వరిల్లేలా ఎందరో సైనికులు స్పూర్తిని ఇస్తున్నా మనం మాత్రం ఆస్పూర్తిని అందుకోలేకపోవటం గమనార్హం .
నిజమైన దేశభక్తితో నిలుస్తున్న సైనికుల కుటుంబాలు
ఇక తెలంగాణా రాష్ట్రానికి చెందిన కల్నల్ సంతోష్ దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టాడు. అయినా మొక్కవోని ధైర్యంతో ఆ తల్లిదండ్రులు జై జవాన్ అంటున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించటంలో గొప్పదనం ఉందని ఆ తల్లి మాటలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. అంతేకాదు సంతోష్ బాబు ఒక జవాన్ గా తల్లిదండ్రులకు, భార్యకు మొదటి నుండి ధైర్యాన్ని నూరిపోశారు. ఇండియన్ ఆర్మీలో పని చేయడం చాలా గొప్ప విషయమని, దేశం కోసం పోరాడడం లోనే గొప్పదనం ఉందని, ఎప్పుడైనా ఏదైనా జరిగితే ఎవరు క్రుంగి పోవద్దని తల్లిదండ్రులకు, భార్యకు సంతోష్ కుమార్ ధైర్యం నూరిపోశారు. ఇక సంతోష్ తండ్రి దేశం కోసం సైనికులుగా పని చేయాలనే తపన తనకు బలంగా ఉండేదని, కానీ కొన్ని కారణాల వల్ల తాను అవకాశం పొందలేక పోయాను అని చెప్పారు. ఇక తన కోరిక తన కుమారుడు తీర్చి, దేశం కోసం వీరోచితంగా పోరాడాడని చెప్పటం గమనార్హం .ఇంతటి దుర్ఘటన జరిగినా, ఒక్కగానొక్క కొడుకు ప్రాణాలు పోగొట్టుకున్న దేశం కోసమే అని ఆ తల్లిదండ్రులు గుండె దిటవు చేసుకున్నారు.
Recommended Video
జై జవాన్ అన్న పదానికి నిజమైన సార్ధకత ఆ రోజే ..
ఇలాంటి తల్లిదండ్రులు ఉన్నంతకాలం, అలాంటి జవాన్లు ఉంటారు. మన దేశం, దేశ ప్రజలు సురక్షితంగా ఉండటం కోసం వారు వీరోచితంగా పోరాడతారు . ఇలాంటి తల్లిదండ్రులు అందించిన స్ఫూర్తి, వీరోచితంగా పోరాడి అసువులు బాసిన వీర జవాన్లు మనలో కలిగిస్తున్న దేశభక్తి ఇప్పటికైనా ఏసీ గదుల్లో కూర్చుని, సాఫ్ట్ వేర్ ప్రపంచంలోనే మునిగిపోయే వారికి, దేశం పట్ల కనీసం ఒక పౌరుడిగా బాధ్యత లేని వారికి, కనువిప్పు కావాలి. దేశం కోసం పోరాటం చెయ్యటంలోనే నిజమైన గొప్పదనం ఉందని గుర్తించాలి. ఆ స్ఫూర్తి కలిగిన నాడు ఇంటికొక్క జవాన్ ఉంటాడు. జై జవాన్ అన్న పదానికి అర్థం సార్థకమవుతుంది.