లాలూ ప్రసాద్ దాణా కేసు: 17 ఏళ్లుగా ఇలా..
రాంఛీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాణా కుంభకోణంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జగన్నాథ్ మిశ్రాలతోపాటు మరో 45మందిని సిబిఐ కోర్టు సోమవారం దోషులుగా తేల్చింది. ఈ కుంభ కోణం మూలంగా లాలూ ప్రసాద్ యాదవ్ తన ముఖ్యమంత్రి పదవిని కూడా కోల్పోయారు. కుంభ కోణం జరిగిన నాటి నుంచి దోషులుగా తేలిన నేటి వరకు వివరాలు..
జనవరి 27, 1996: దాణా కుంభకోణం వెలుగు చూసింది. కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము దాణా పంపిణీ పేరిట మనుగడలో లేని కంపెనీలకు తరలించడం జరిగింది. అయితే పశువుల దాణాను ఒక స్కూటరుపై తరలించినట్లు ఓ కాగితం మీద చూపించారు.
మార్చి 11, 1996: దాణా కుంభ కోణంపై విచారించాలని సిబిఐకి పాట్నా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మార్చి 19, 1996: హైకోర్టు ఆదేశాలను సుప్రీం కోర్టు సమర్థించింది. విచారణను పర్యవేక్షించేందుకు ఒక బెంచ్ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
జులై 27, 1997: సిబిఐ విచారణ, నేరారోపణల నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ తన భార్య రబ్రీ దేవిని బీహార్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు.
జులై 30, 1997: సిబిఐ కోర్టులో లాలూ ప్రసాద్ యాదవ్ లొంగిపోయారు.
ఆగస్టు 19, 1998: లాలూ ప్రసాద్, రబ్రీ దేవీలపై అదనపు ఆస్తుల కేసు నమోదు.
ఏప్రిల్ 4, 2000: డిఏ కేసు ఛార్జీషీటులో ప్రధాన నిందితునిగా లాలూ ప్రసాద్, నిందితురాలిగా రబ్రీ దేవిని ప్రస్తావించడం జరిగింది.
ఏప్రిల్ 5, 2000: లాలూ ప్రసాద్, రబ్రీ దేవీలు లొంగిపోయారు. కాగా బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న రబ్రీ దేవికి బెయిల్ లభించింది.
జూన్ 9, 2000: లాలూ ప్రసాద్పై కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేయడం జరిగింది.
అక్టోబర్ 2001: నూతన రాష్ట్రంగా జార్ఖండ్ ఏర్పడిన కారణంగా లాలూ కేసులన్నీ ఆ రాష్ట్రానికి బదిలీ చేస్తూ తర్వాతి నెలలో రాంఛీలో లొంగిపోవాలని లాలూను ఆదేశించారు.
డిసెంబర్ 18, 2006: లాలూ ప్రసాద్, రబ్రీ దేవీలకు డిఏ కేసులో క్లీన్ చిట్ లభించింది.
2000-2012: జార్ఖండ్ కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో కేసుకు సంబంధించిన కొందరు కీలక సాక్షులు మరణించారు.
మే 17, 2013: సిబిఐ ప్రత్యేక కోర్టుకు లాలూపై మరో దాణా కుంభకోణం ఆరోపణలు. ఈ కేసులో మోసపూరితంగా దుమ్కా ట్రెజరీ నుంచి రూ.3.13 కోట్లను డిసెంబర్ 1995 నుంచి జనవరి 1996 మధ్యలో విత్ డ్రా చేసినట్లు ఆరోపణలున్నాయి.
సెప్టెంబర్ 17, 2013: దాణా కుంభకోణం కేసులో రాంఛీ ప్రత్యేక కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది.
సెప్టెంబర్ 30, 2013: బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, జగన్నాథ్ మిశ్రాలతోపాటు 45మందిని దాణా కుంభకోణంలో నిందితులుగా పేర్కొంటూ న్యాయమూర్తి ప్రవాస్కుమార్ సింగ్ తీర్పును వెలువరించారు. నిందితులకు అక్టోబర్ 3న శిక్షను ఖరారు చేయనున్నారు.