టైమ్స్ నౌ సర్వే: మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మళ్లీ బీజేపీకే, రాజస్థాన్ మాత్రం ‘చేతి’కే!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. గెలుపు కోసం పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. నవంబర్, డిసెంబర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టైమ్స్ నౌ తన సర్వే ఫలితాలను ప్రకటించింది.
టైమ్స్ నౌ సర్వే ప్రకారం.. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తన అధికారాన్ని నిలుపుకోనుంది. అయితే, రాజస్థాన్లో మాత్రం బీజేపీ అధికారం కోల్పోనుందని, కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చింది.
మధ్య ప్రదేశ్-230అసెంబ్లీ స్థానాలు
బీజేపీ-142
కాంగ్రెస్-77
ఇతరులు-11
కాగా, 15ఏళ్లుగా పాలిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కి జనాదరణ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. ముఖ్యమంత్రిగా ఎవర్ని కోరుకుంటున్నారంటే.. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్(బీజేపీ)కు అనుకూలంగా 61శాతం మంది ఉండగా, ఆ తర్వాత స్థానంలో జ్యోతిరాదిత్య సిందియా(కాంగ్రెస్) 17శాతం, దిగ్విజయ్ సింగ్(కాంగ్రెస్) 5శాతంతో బాగా వెనకబడి ఉన్నారు. కమల్నాథ్(కాంగ్రెస్) 6శాతం, ఇతరులు 11శాతం ఉన్నారు.
రాజస్థాన్-200 అసెంబ్లీ స్థానాలు
బీజేపీ-75
కాంగ్రెస్-115
ఇతరులు-10
ఛత్తీస్గఢ్-90 అసెంబ్లీ స్థానాలు
బీజేపీ-47
కాంగ్రెస్-33
ఇతరులు-30
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతోపాటు నవంబర్, డిసెంబర్ నెలల్లో మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటివరకు విడుదలైన సర్వేలు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టనే తిరిగి అధికారం చేపడుతుందని పేర్కొన్నాయి.