టైమ్స్ నౌ సర్వే: తిరుగులేని నరేంద్ర మోడీ, ఎన్నికలకు ముందు ఎంత పెరిగిందంటే?
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ట ఏడు శాతం పెరిగిందని టైమ్స్ నౌ- వీఎంఆర్ పోల్స్ సర్వేలో వెల్లడైంది. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 21వ తేదీ మధ్య ఈ పోల్ నిర్వహించారు. మోడీ బెట్టర్ అని 52 శాతం మంది చెప్పగా, రాహుల్ గాంధీకి 27 శాతం మంది మాత్రమే ఓటేశారు. ఇతర ప్రాంతీయ పార్టీలకు కేవలం 7.3 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. అంతకుముందు జనవరిలో మోడీకి 44.4 శాతం ఓట్లు, రాహుల్ గాంధీకి 30 శాతం ఓట్లు పడ్డాయి. ఇప్పుడు మోడీ గ్రాఫ్ పెరగగా, రాహుల్ గ్రాఫ్ తగ్గింది.
ఇండియా టీవీ సర్వే: మోడీదే హవా.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు అంటే, తెరాసకు 14, వైసీపీకి 22, టీడీపీకి 3
రాహుల్ గాంధీకి ఊరటనిచ్చే అంశం
రాహుల్ గాంధీ నమ్మకమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నారని దాదాపు 43 శాతం మంది అభిప్రాయపడ్డారు. 40 శాతం మంది మాత్రం దీనిని వ్యతిరేకించారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికల హామీలను అతి తక్కువగా నెరవేర్చిందని 46 శాతం చెప్పగా, 27 శాతం మంది మాత్రం హామీలన్నింటిని నెరవేర్చిందన్నారు. ఉద్యోగ కల్పనే అతిపెద్ద ఎన్నికల అంశంగా 40 శాతం మంది చెప్పారు. 17.7 శాతం మంది మాత్రం వ్యవసాయమని, 14 శాతం మంది రామమందిర నిర్మాణమన్నారు.
మోడీ తీసుకొచ్చిన ఆ పథకం ఎంతో మేలు
నరేంద్ర మోడీ ఆదాయపన్ను పరిమితి అంశంపై ప్రశ్నించగా బాగుందని 33 శాతం, కాస్త ఆలస్యమైందని 29.9 శాతం మంది, ఎన్నికల స్టంట్ అని 24.1 శాతం మంది చెప్పారు. పీఎం కిసాన్ సమ్మాన్ నుంచి పెద్దగా ఉపయోగం లేదని 30 శాతం మంది అభిప్రాయపడగా, రైతులకు ఎంతో మేలు అని, బాగుందని 56 శాతం మంది అభిప్రాయపడ్డారు.
విపక్షాల ఐక్య కూటమిది అవకాశవాద రాజకీయం
విపక్షాల ఐక్య కూటమి గురించి ప్రశ్నించగా.. దాని గురించి ఏమీ చెప్పలేమని 35 శాతం మంది చెప్పగా, అవకాశవాదం అని 32 శాతం మంది చెప్పారు. దేశవ్యాప్తంగా 690 ప్రదేశాల్లో 14,431 మందిని అడిగి సర్వే చేశారు.