టైమ్స్ మెగా పోల్ సర్వే: 84% మంది మోడీకే ఓటు, రాహుల్కు 8%, అచీవ్మెంట్స్ సహా ఈ ప్రశ్నలపై ఇలా..
న్యూఢిల్లీ: ఇప్పుడు ఎన్నికలు జరిగితే.. నరేంద్ర మోడీకి, భారతీయ జనతా పార్టీకి తిరుగు లేదని టైమ్స్ మేగా పోల్ సర్వేలో వెల్లడైంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు చేసిన ఈ సర్వేలో.. రెండు లక్షలమంది పాల్గొన్నారు. మళ్లీ మోడీయే రావాలని 84 శాతానికి పైగా కోరుకున్నారు. రాహుల్ గాంధీని కోరుకున్న వారు 8 శాతానికి పైగా మాత్రమే ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీకి ఇది కొత్త ఉత్సాహమని చెప్పవచ్చు.
మళ్లీ బీజేపీ వస్తుంది
2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత మళ్లీ బీజేపీ ప్రభుత్వమే వస్తుందని 83 శాతం మంది అభిప్రాయపడ్డారు. మళ్లీ నరేంద్ర మోడీయే ప్రధాని కావాలని 84 శాతం మంది కోరుకున్నారు. మోడీకి అందనంత దూరంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ రెండో స్థానంలో ఉన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా కోరుకుంటున్న వారు 9 శాతం కూడా లేరు. 83.03 శాతం మంది బీజేపీ ప్రభుత్వం వస్తుందని, 9.25 శాతం మంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పారు. ప్రధానిగా నరేంద్ర మోడీ కాకుండా మరొకరు అయితే ఎన్డీయే గెలుపు అవకాశాలు 4.25 శాతం మాత్రమేనని ఈ సర్వేలో తేలింది. మహాఘట్బంధన్ ప్రభుత్వం వస్తుందని 3.47 శాతం ఉంది.
రాహుల్ గాంధీకి అందనంత ఎత్తులో నరేంద్ర మోడీ
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధానమంత్రిగా ఎవరిని ఎంచుకుంటారని ప్రశ్నించగా 83.89 శాతం మంది నరేంద్ర మోడీని కోరుకున్నారు. రాహుల్ గాంధీ కేవలం 8.33 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. మమతా బెనర్జీ 1.44 శాతం ఓట్లతో మూడో స్థానంలో, మాయావతి 0.43 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఇతరులకు 5.92 శాతం ఓట్లు పడ్డాయి.
రాహుల్ గాంధీ పాపులారిటీ పెరగలేదు
2014తో పోల్చితే ఇప్పుడు రాహుల్ గాంధీకి పాపులారిటీ పెరిగిందా అని అడిగితే 63.03 శాతం మంది పెరగలేదని, 31.15 శాతం మంది పెరిగిందని, 5.82 శాతం మంది ఏమీ చెప్పలేమన్నారు.
మోడీకి ఫుల్ మార్క్స్
మోడీ ప్రభుత్వం ఎలా పని చేసిందని ప్రశ్నించగా 59.51 శాతం మంది చాలా బాగా పని చేసిందని చెప్పగా, 22.29 శాతం మంది బాగా పని చేసిందని, 9.94 శాతం మంది బాగా పని చేయలేదని, 8.25 శాతం మంది పరవాలేదని పేర్కొన్నారు. అంటే మొత్తంగా మోడీ పాలనపై 80 శాతంకు పైగా ప్రజలు పూర్తి సంతృప్తితో ఉండగా, అసంతృప్తితో ఉన్న వారు పది శాతం కూడా లేరు.
మోడీ హయాంలో బిగ్గెస్ట్ అచీవ్మెంట్, బిగ్గెస్ట్ ఫెయిల్యూర్
మోడీ హయాంలో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ గురించి ప్రశ్నించగా పేదలకు మరిన్ని సదుపాయాలు అని 34.39 శాతం మంది, జీఎస్టీ అని 29.09 శాతం మంది, స్వచ్చ్ భారత్ అని 18.68 శాతం మంది, సర్జికల్ స్ట్రయిక్స్ అని 17.84 శాతం మంది పేర్కొన్నారు. బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఏదని ప్రశ్నించగా రామ మందిరం అని 35.72 శాతం మంది, ఉద్యోగాల కల్పన అని 29.52 శాతం మంది, నోట్ల రద్దు అని 13.5 శాతం మంది, అసహనం అని 12.97 శాతం మంది పేర్కొన్నారు.
మైనార్టీలకు భద్రత ఉందని 65 శాతం మంది
2019 సార్వత్రిక ఎన్నికలకు కీలకమైన అంశం ఏమని ప్రశ్నించగా ఉద్యోగాలు అని 40.21 శాతం మంది, రైతుల అంశమని 21.82 శాతం, రామాలయం అని 10.16 శాతం, జీఎస్టీ అమలు అని 4.52 శాతం, ఇతర అంశాలు అని 23.3 శాతం మంది చెప్పాురు. మోడీ హయాంలో మైనార్టీలు భయపడుతున్నారా అని ప్రశ్నిస్తే అదేమీ లేదని 65.51 శాతం మంది చెప్పగా, అవునని కేవలం 24.26 శాతం మంది చెప్పారు. ఏమీ చెప్పలేమని 10.24 శాతం మంది తెలిపారు. అలాగే, అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు బీజేపీకి లాభిస్తుందా అని ప్రశ్నించగా.. 72.66 శాతం మంది అవునని, 15.25 శాతం మంది కాదని చెప్పారు. రాఫెల్ ప్రభావం బీజేపీకి నష్టం చేస్తుందా అని ప్రశ్నించగా.. 74.59 ప్రభావం ఉండదని, అవునని 17.51 శాతం మంది చెప్పారు.