టిప్పుసుల్తాన్ జయంతి, బీజేపీ ఆందోళన, బంద్, 144 సెక్షన్, హై అలర్ట్, సీఎం దూరం!
బెంగళూరు: ప్రతిపక్ష బీజేపీ ఆందోళనల మధ్య కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లో టిప్పుసుల్తాన్ జయంతి ఉత్సవాలను కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. నవంబర్ 10వ తేదీ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అధికార లాంచనాలతో టిప్పుసుల్తాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. టిప్పుసుల్తాన్ జయంతి ఉత్సవాలను వ్యతిరేకిస్తూ బీజేపీ ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టింది. టిప్పుసుల్తాన్ జయంతి ఉత్సవాలకు కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి దూరంగా ఉన్నారు. టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను వ్యతిరేకిస్తు బీజేపీ బంద్ కు పిలుపునిచ్చింది.
కొడుగు బంద్
టిప్పుసుల్తాన్ జయంతి వేడుకలు రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తూ కొడుగు జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు. కొడుగు బంద్ కు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బంద్ సందర్బంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఆదివారం ఉదయం 6 గంటల వరకూ కొడుగు జిల్లా మొత్తం 144 సెక్షన్ విధిస్తూ జిల్లాధికారి శ్రీవిద్యా ఆదేశాలు జారీ చేశారు.
ఐదు జిల్లాల్లో హైఅలర్ట్
కొడుగు, మంగళూరు, మండ్య, హుబ్బళి-దార్వాడ, శివమొగ్గ తదితర జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆదివారం ఉదయం 6 గంటల వరకూ ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించరాదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఉదయం వరకూ పలు జిల్లాలో మద్య నిషేదం విధించారు.
సరిహద్దుల్లో నిఘా
దక్షిణ విభాగం ఐజీపీ కేవీ. శరత్ చంద్ర నేతృత్వంలో 1,500 మంది పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. 50 ప్రాంతాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి బయటి నుంచి వస్తున్న అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
బెంగళూరులో నిషేధాజ్ఞలు
టిప్పుసుల్తాన్ జయంతి ఉత్సవాల సందర్బంగా బెంగళూరు నగరంలోని సున్నితమైన ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. శివమొగ్గ జిల్లాలో ఆదివారం ఉదయం వరకు 144 సెక్షన్ విధించామని జిల్లాధికారి కేఏ. దయానంద్ ఆదేశాలు జారీ చేశారు. హుబ్బళి-దార్వాడలో బంద్ కు పిలుపు నివ్వడంతో నిషేధాజ్ఞలు జారీ చేశామని జిల్లాధికారి ఎంఎన్. నాగరాజ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యే చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
టిప్పుసుల్తాన్ సమాధి
మండ్య జిల్లాలోని టిప్పుసుల్తాన్ సమాధి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీరంగపట్టణంలో శుక్రవారం నుంచి నిషేధాజ్ఞలు అమలు చేశారు. టిప్పుసుల్తాన్ సమాధి దగ్గర ఎవ్వరూ సంచరించకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. టిప్పుసుల్తాన్ జయంతి వేడుకలు నిర్వహించే కార్యక్రమం ఆహ్వాన పత్రికల్లో తన పేరు ముద్రించరాదని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా మనవి చేశారు.