టిప్పుసుల్తాన్ గొడవ: రేపు బంద్, సోనియాకు నిలదీత
బెంగళూరు: టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో... శుక్రవారం నాడు విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కర్నాటకలో బంద్, రాస్తా రోకోకు పిలుపునిచ్చింది. టిప్పు సుల్తాన్ జయంతిని కర్నాటక ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది.
దీనిని వ్యతిరేకిస్తూ పలువురు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్త ఒకరు మృతి చెందారు. మరో వ్యక్తి కూడా మృతి చెందారు. ఈ నేపథ్యంలో టిప్పు సుల్తాన్ జయంతి అంశం కర్నాటకలో ఉద్రిక్తతకు దారి తీసింది.
హింసాత్మకం, విహెచ్పీ కార్యకర్త మృతి నేపథ్యంలో 13వ తేదిన కర్నాటక బందుకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా, టిప్పు సుల్తాన్ జయంతి అంశం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ముచ్చెమటలు పట్టిస్తోంది. అతను వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బిజెపి డిమాండ్ చేస్తోంది.
దేశంలో మత అసహనం అంటూ సోనియా గాంధీ కొద్ది రోజుల క్రితం రాష్ట్రపతి భవన్కు మార్చ్గా వెళ్లి రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారని, ఇప్పుడు సిద్ధరామయ్యను తొలగించేందుకు ఆమె మార్చ్ చేయాలని డిమాండ్ చేశారు. సిద్ధరామయ్య ప్రభుత్వంలో శాంతిభద్రతలు లేవన్నారు.