టిప్పు సుల్తాన్ ఆయుధాలకు రూ.70 కోట్లు, ఖడ్గానికే రూ.20 కోట్లు
లండన్: టిప్పు సుల్తాన్ ఆయుధాలు లండన్ వేలంలో భారీ ధర పలికాయి. ఏప్రిల్ 21వ తేదీన బొన్హమ్స్ ఇస్లామిక్ అండ్ ఇండియన్ సేల్ ఆధ్వర్యంలో మైసూర్ మహారాజు టిప్పు సుల్తాన్కు చెందిన30 వస్తువులను వేలంలో ఉంచారు.
రత్నాలు పొదిగి, పిడి దగ్గర పులి తల బొమ్మ ఉండే ఖడ్గం అత్యధికంగా దాదాపు రూ.20 కోట్ల 78 లక్షలకు అమ్ముడుపోయింది. ఓ ఫిరంగి సుమారు రూ.13 కోట్ల 56 లక్షలు పలికింది. టిప్పు సుల్తాన్ వ్యక్తిగత తుపాకీ సుమారు రూ.6 కోట్ల 87 లక్షలకు అమ్ముడు పోయాయి.
కత్తులు, అమ్ములపొదులు, రక్షక కవచాలు, పిస్టోళ్లను ఈ వేలంలో ఉంచారు. వీటి ద్వారా దాదాపు రూ.70 కోట్ల నలభై లక్షలు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు.
కాగా, టిప్పు సుల్తాన్ కత్తి వజ్రవైడూర్యములు పొదగబడిన పిడితో కూడి ఉంది. బంగారు జరీతో నేసిన రక్షక కవచం, నడుము దట్టీ (బెల్టు), ఏడు బాణాలు పచ్చలు, కెంపులతో రూపొందించిన అరుదైన ఫలకం, వినోదానికి వాడే తుపాకీ.. వీటన్నింటిని వేలంలో ఉంచారు.
టిప్పు సుల్తాన్ 1799లో డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్తో జరిగిన యుద్ధంలో ఓడి, అసువులు బాశారు. మైసూరు మహానగరాన్ని కొల్లగొట్టిన బ్రిటిష్ సేనలు టిప్పు సుల్తాన్కు చెందిన ఈ వస్తువులతోపాటు ఎంతో బంగారాన్ని, మరెన్నో ఆభరణాలను, ఆయుధాలను దోచుకుని తమ దేశానికి తరలించాయి. వాటిలో టిప్పు సుల్తాన్ వస్తువులను మంగళవారం లండన్ వేలం సంస్థ బోన్హామ్స్లో వేలం వేశారు.