నోట్ల రద్దు: ప్రజల ఆగ్రహం, అందరికీ లడ్డూలు పంచనున్న బీజేపీ
ఏటీఎంలు, బ్యాంకుల ముందు బారులు తీరిన ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు.. వారికి లడ్డూలు పంపిణీ చేయాలని ఢిల్లీ బీజేపీ భావిస్తోంది.
ఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు ఏటీఎంల వద్ద, బ్యాంకుల వద్ద క్యూలో నిలబడుతూ ఇబ్బందులు పడుతున్నారు. నోట్ల రద్దును మెజార్టీ ప్రజలు మెచ్చుకుంటున్నప్పటికీ.. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల ఆగ్రహం తీర్చేందుకు ఢిల్లీ బీజేపీ అధినేత వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. ఏటీఎంలు, బ్యాంకుల ముందు బారులు తీరిన ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు.. వారికి లడ్డూలు పంపిణీ చేయనున్నారు.
ఢిల్లీ చీఫ్ తివారి ఈ విషయమై మాట్లాడాహరు. ప్రజలు ఎంతో సహనంతో క్యూలో నిల్చుంటారని, అటువంటి వారి కోసం తాము వచ్చేనెల 1 నుంచి జనవరి 10వ తేదీ ఓ కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. ప్రజల ఇంటింటికీ వెళ్లి తలుపు తట్టి స్వీట్లు పంపిణీ చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొంటూ స్థానిక బీజేపీ కార్యకర్తలు లడ్లు కొనాలని, ఇంటింటికీ తిరుగుతూ కుటుంబానికో లడ్డు పంచాలన్నారు. అంతేకాదు ఢిల్లీలోని ఏటీఎంల ముందు క్యూలో నిల్చున్న వారికి కూడా తాము టోకెన్లు ఇచ్చి లడ్డూలను పంపుతామన్నారు. నల్లధనాన్ని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాలని దేశానికి కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కొంత కాలం ఇబ్బందులు ఉంటాయన్నారు.