అనుమానం: భార్యా, పిల్లలు, అత్తామామలను పొడిచేశాడు
చెన్నై: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త మద్యం మత్తులో ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆమెతోపాటు పిల్లలు, అత్తామామలపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మంగళవారం రాత్రి తమిళనాడులో చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తిరునల్వేలి జిల్లా అంబై ప్రాంతంలో బ్రమ్మకుట్టి (25), రాజం (23) దంపతులు నివసిస్తున్నారు. ఐదేళ్లకు ముందు ప్రేమ వివాహం చేసుకున్న వీరికి ఇస్యా (4), నాదస్వరి (2) అనే ఇద్దరు కుమార్తెలున్నారు.
బ్రమ్మకుట్టి రోజూ రాత్రిపూట తాగి ఇంటికొచ్చి భార్యతో గొడవపడుతుండేవాడు. గత కొద్ది రోజులుగా భార్య రాజం శీలంపైనా అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో భర్త ఆగడాలను భరించలేక ఆరుమాసాలకు ముందు రాజం, పిల్లలను వెంట బెట్టుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.
ఒంటరితనాన్ని భరించలేని బ్రమ్మకుట్టి అత్తింటివారికి తరచూ వెళ్లి భార్యను కాపురానికి రమ్మని అడుగుతుండేవాడు. రాజం మాత్రం అందుకు అంగీకరించకలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి పీకలదాకా తాగిన బ్రమ్మకుట్టి వేటకొడవలిని తీసుకుని అత్తగారింటికి వెళ్లి తలుపుతట్టాడు. రాజం తలుపుతెరిచింది.
వెంటనే భార్యపై బ్రమ్మకుట్టి వేటకొడవలితో దాడి చేశాడు. అడ్డు కునేందుకు ప్రయత్నించిన అత్త మామలను కూడా కత్తితో పొడిచాడు. తన ఇద్దరు కుమార్తె లపైనా కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని బ్రమ్మకుట్టి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాజం, ఆమె తండ్రి చంద్రశేఖర్, తల్లి ముత్తులక్ష్మి,ఇద్దరు కుమార్తెలు తిరునల్వేలి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.