అనుచిత వ్యాఖ్యలు: 'ఆమె తాగే సిగరెట్ పొడవు ఎంతుంటుందో'
కోల్కత్తా: సీపీఐ-ఎం నుంచి బహిష్కరణకు గురై ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) తరుపున ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్న వృద్ధ నేత రజాక్ మొల్లా హౌరా నార్త్ నియోజక వర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన ప్రముఖ నటి, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రూపా గంగూలీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
బుధవారం ఆయన బెంగాలీ న్యూస్ ఛానెల్ ఏబీపీ ఆనందాకి ఇచ్చిన ఇంటర్యూలో రూపా గంగూలీ లైఫ్ స్టయిల్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 'ఆమె తాగే సిగరెట్ పొడవు ఎంతుంటుందో నాకు తెలుసు. ఆమె ఎవరితో కలిసి సహాజీవనం చేస్తుందో నాకు తెలుసు. సీరియల్ పాత్రలోనే కాదు నిజజీవితంలోనూ ఆమె ద్రౌపతే' అని వ్యాఖ్యానించారు.
అంతక ముందు రజాక్.. తమ అధినేత్రి మమతా బెనర్జీతో పాటు మరో నటి మున్ మున్ సేన్పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మున్ మున్ సేన్ను పార్లమెంట్ (రాజ్యసభకు) పంపాలని మమత భావిస్తున్నారని, మున్ మున్ లాంటి సెలబ్రిటీలు ఎంపీలుగా ఏమాత్రం పనికిరారని కుండబట్టలు కొట్టినట్లు చెప్పారు.
సెలబ్రిటీలకు ప్రజాసమస్యలపై అవగాహన ఉండదని కాబట్టి మమత వారిని పార్లమెంట్కు పంపకుండా ఉంటే బాగుంటుందని రజాక్ చెప్పారు. ఎన్నికల సమయం కావటంతో రజాక్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. రజాక్ వ్యాఖ్యలపై స్పందించిన రూపా గంగూలీ మాట్లాడుతూ ఒక మహిళ నేతృత్వంలో నడిచే పార్టీ నాయకులు మరో మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం దారుణమని అన్నారు.
రజాక్ తనను అవమానించారని, ఆయనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని అన్నారు. 1988 నుంచి భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ సిరియల్ 'మహాభారత్'లో ఈమె ద్రౌపది పాత్రను పోషించి, దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.
ప్రస్తుతం పశ్చిమ బెంగాల్కు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో హౌరా (నార్త్) నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇక ఆ స్థానంలో ప్రముఖ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా (టీఎంసీ) నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో పోరు హోరాహోరీగా మారింది. ఇతర నాయకులు కూడా తమ అభ్యర్థుల కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.