బెంగాల్ ఉప ఎన్నికల్లో బీజేపీకి షాక్...! సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన కమలం...!!
పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో బీజేపీ చతికిల పడింది. ఎమ్మెల్యే నుండి ఎంపీ స్థానాన్ని గెలుచుకున్న పార్టీ, తిరిగి తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేక పోయింది. దీంతో ఉప ఎన్నికలు జరిగిన మూడు స్థానాల్లో తృణముల్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఫలితాలతో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం కొల్పోయిన టీఎంసీ తిరిగి స్థానాన్ని పదిలపరుచుకుంది. ఇక ఫలితాలపై స్పందించిన సీఎం మమతా బెనర్జీ బీజేపీ అహాంకారపూరిత రాజకీయాలు పని చేయవని రుజువయిందని అన్నారు.
బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకున్న టీఎంసీ
పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ తిరిగి తన సత్తాను చాటుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో సగం స్థానాలను కోల్పోయిన ఆరు నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తిరిగి పుంజుకుంది. ఉప ఎన్నికలు జరిగిన మొత్తం మూడు స్థానాలను కైవసం చేసుకుంది. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సిట్టింగ్ స్థానాలను కూడ మమతా పార్టీ కైవసం చేసుకోవడంతో అధికార టీఎంసీ నేతల్లో హర్షం వ్యక్తం అవుతోంది.
బీజేపీ అహంకారానికి మూల్యం చెల్లించిందన్న దీదీ
ముఖ్యంగా మూడు దశాబ్దాల తర్వాత బీజేపీ సిట్టింగ్ స్థానమైన ఖరగ్పూర్ సర్ధార్లో గెలుపొంది బీజేపీకి షాకిచ్చింది. గెలుపుపై హర్షం వ్యక్తం చేసిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల తీర్పుపై స్పందించారు. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలకు మితిమీరిన అహం, గర్వం మంచిది కాదని... అయితే ఈ రెండు లక్షణాలు బీజేపీకి ఉన్నాయని అందుకే ప్రజలు తిరస్కరించారని అన్నారు. ఉప ఎన్నికల్లో ఓటమి బీజేపీ అహంకారానికి మూల్యం చెల్లించిందని మండిపడ్డారు. బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.
మూడు స్థానాల్లో ఉప ఎన్నికలు
కాగా పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని ఖరగ్పూర్ , కరీంపూర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు లోక్సభకు ఎన్నిక కావడంతో పాటు ఉత్తర దినాజ్పూర్లోని కలియాగంజ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రమత నాథ్ రాయ్ మరణించడంతో ఆ మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అయితే ఖరగ్పూర్ సర్ధార్ అసెంబ్లీ స్థానం బీజేపీ అభ్యర్థి దిలిప్ ఘోష్ లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించగా... ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీగా గెలిచి ఎమ్మెల్యే స్థానాన్ని కోల్పోయింది.
పరువును నిలబెట్టుకున్న తృణముల్
ఈ సంవత్సరం మేలో జరిగిన ఉప ఎన్నికల్లో మొత్తం 42 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ అనుహ్యంగా 17 స్థానాల్లో విజయం సాధించగా...అధికారంలో ఉన్న తృణముల్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థులు సిట్టింగ్ స్థానాలను కోల్పోయి కేవలం 18 లోక్సభ స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. దీంతో ఇరు పార్టీల మధ్య తీవ్ర ఘర్షణలు కూడ చెలరేగాయి. అనాటీ నుండి బెంగాల్లో పాగా వేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. అయితే ప్రస్తుతం జరిగిన అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ సిట్టింగ్ స్థానాలకు సైతం చెక్పెట్టి అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీ తిరిగి తన పరువును నిలబెట్టుకుంది.