రచ్చ మొదలైంది: బీజేపీ వ్యతిరేక కూటమిపై మమతా అసంతృప్తి
బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ ఒకే వేదికపై తమ ఐక్యతను చాటుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రయత్నాలకు ఆదిలోనే చెక్ పడ్డట్టు కనిపిస్తోంది. ఆదివారం చెన్నైలో కలైంగ్జనర్ కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో సహా పలు పార్టీల అధినేతలు హాజరయ్యారు. అయితే ఇంతటి కీలక కార్యక్రమానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలు గైర్హాజరవ్వడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. భావి ప్రధాని రాహుల్ గాంధీ అని స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అన్ని పార్టీలు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కడుతున్నప్పుడు రాహుల్ గాంధీని ప్రధానిగా ఎలా ప్రకటిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది మమతా పార్టీ. రాహుల్ పేరే కాదు...ప్రధాని అభ్యర్థిగా ముందుగానే ఎవరి పేరును ప్రకటించకూడదని చెబుతోంది. అది కూటమికి మంచిది కాదని టీఎంసీ భావిస్తోంది.
స్టాలిన్ ప్రతిపాదనపై గుర్రుగా ఉన్న మమతా పార్టీ
"ఢిల్లీలో కొత్త ప్రధానిగా రాహుల్ గాంధీ పేరును ప్రకటిస్తున్నాను. తమిళనాడు గడ్డపై నుంచి మన భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ పేరును ప్రతిపాదిస్తున్నాను. మోడీ ప్రభుత్వాన్ని కూల్చడంలో సత్తా ఉన్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ. ఈ దేశాన్ని మోడీ ప్రభుత్వాన్నుంచి రక్షించుకుంటాం. రాహుల్ గాంధీకి అన్ని వేళలా మద్దతుగా ఉండి ఆయనకు సహకరిస్తాం" అని డీఎంకే అధినేత స్టాలిన్ బహిరంగ సభలో చెప్పారు. ఇదిలా ఉంటే స్టాలిన్ చేసిన ప్రకటనపై టీఎంసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల తర్వాతే భారత ప్రధాని పేరును ప్రకటిస్తామని అంతకుముందే చెప్పామంటోంది తృణమూల్ కాంగ్రెస్. మరి ఇలాంటి సమయంలో స్టాలిన్ రాహుల్ గాంధీ పేరును ఎలా ప్రతిపాదిస్తారని ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీనే ప్రధానిగా రాహుల్ గాంధీ పేరును తెరపైకి తీసుకురావడం లేదని మరి ఇతర పార్టీలకు ఆ ఆసక్తి ఎందుకని టీఎంసీ ప్రశ్నిస్తోంది.
ప్రధాని పేరు ప్రకటనపై అప్పుడే తొందరెందుకు: ఎస్పీ
ఇదిలా ఉంటే సమాజ్ వాదీ పార్టీ కూడా ప్రధాని పేరును ఇప్పుడే ప్రకటించడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రజల తీర్పుతోనే భారత భావి ప్రధానిని నిర్ణయించడం జరుగుతుందని ఇప్పుడే ప్రకటించాల్సిన అవసరం లేదని అన్నారు సమాజ్ వాదీ పార్టీ సీనియన్ నేత ఘనశ్యామ్ తివారి. అయితే రాహుల్ గాంధీకి తాము వ్యతిరేకం కాదని చెబుతూనే... ఇప్పటి వరకు ప్రధాని అంశంపై ఇంకా చర్చ జరగలేదని అప్పుడే తొందర ఎందుకని ఆయన అన్నారు. ప్రధాని పేరును ప్రకటించేముందు అన్ని పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. స్టాలిన్ ప్రతిపాదనను సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని లోక్సభ ఎన్నికల తర్వాత ప్రధాని అభ్యర్థి పేరు ప్రకటించి ఉంటే బాగుండేదని విపక్ష పార్టీలకు చెందిన ఓ అగ్రనేత చెప్పారు.
బీజేపీని కూల్చేందుకు అందరం కలిసి పనిచేస్తాం: సోనియాగాంధీ
ఇక కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ బీజేపీపై పోరాడేందుకు దేశంలోని విపక్షపార్టీలన్నీ కలసి పనిచేస్తున్నాయని అన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో అంతా కలిసే పనిచేస్తామని సోనియాగాంధీ ప్రకటించారు. మరోవైపు రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సుప్రీంకోర్టు, రిజర్వ్ బ్యాంక్ లాంటి స్వతంత్ర సంస్థలను బీజేపీ భ్రష్టుపట్టిస్తోందని అలా జరగకుండా తాము కాపాడుకుంటామని రాహుల్ గాంధీ అన్నారు. ఒకే ఆలోచన విధానతో భారత్ను నడిపించాలని బీజేపీ భావిస్తోందని ఇక కమలం పార్టీ ఆటలు సాగవని రాహుల్ అన్నారు. ఇదిలా ఉంటే ఐదురాష్ట్రాల ఎన్నికల తర్వాత బీజేపీ వ్యతిరేక శక్తులు ఒకే గొడుగు కిందకు చేరడం ఇది రెండో సారి కావడం విశేషం. తొలి సమావేశం ఢిల్లీలో డిసెంబర్ 10న జరిగింది.