ఇవిగో ఆధారాలు : అమిత్ షా అబద్ధాల కోరు, వీడియో విడుదల చేసిన టీఎంసీ
కోల్కతా : సేవ్ డెమోక్రసీ ర్యాలీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు సంబంధించి అధికార టీఎంసీ ఆధారాలు విడుదల చేసింది. నిన్న ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని బీజేపీ గుండాలే కూల్చివేశారని ... అందుకు సంబంధించిన వీడియోనే టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ మీడియాకు అందజేశారు. అమిత్ షా ర్యాలీతో నిన్న కోల్ కతా విధులు ఆగ్రహావేశాలకు దారితీశాయని ... నిన్నటి ఘటన బెంగాల్ పేరును చెడగొట్టిందని విమర్శించారు.
క్షణ క్షణం .. ఉద్రిక్తం
ఢిల్లీలో ఉంటున్న అమిత్ షా మంగళవారం ర్యాలీ తీసి .. ఇక్కడి పరిస్థితిని చెడగొట్టేందుకు కారణమయ్యాడని ఆరోపించారు. బెంగాల్లో స్థానికేతరులను తీసుకురావడంలో మీ ఆంతర్యం ఏంటీ అని అమిత్ షాను ప్రశ్నించారు. తజిందర్ బగ్గా అనే వ్యక్తి ఎవరు, అతను ఇదివరకు ఢిల్లీలో ఓ వ్యక్తిని చెంపపై కొట్టడంతో అరెస్టవ్వలేదా అని నిలదీశారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అమిత్ షాను డిమాండ్ చేశారు.
బీజేపీ గుండాల రంగప్రవేశం
విద్యాసాగర్ కాలేజీ గేట్లను బీజేపీ గుండాలు తీసివేశారని ఒబ్రెయిన్ ఆరోపించారు. నిన్న బీజేపీ చేసిన దాడికి సంబంధించి ఆధారాలు చూడాలని కోరారు. దీనిని బట్టి అమిత్ షా చెప్పేది ముమ్మాటికీ అబద్ధమని తేలిందని దుయ్యబట్టారు. బెంగాల్లో ఓట్లు దండుకునేందుకు అమిత్ షా నాటకాలు ఆడారని .. అయితే బెంగాల్ ప్రజలు విశ్వసనీయత వారి తీర్పుతో మరోసారి రుజువవుతుందని స్పష్టంచేశారు. అంతేకాదు వారం క్రిత ఠాగోరు బోలాపూర్ లో జన్మించారని కామెంట్ చేశారు.
ప్రణాళిక ప్రకారం ...
మంగళవారం నాడు బీజేపీ ప్రణాళిక ప్రకారం హింసకు పాల్పడిందని ఆరోపించారు. దీనికి సంబంధింతి తమ పార్టీ ఎన్నికల సంఘానికి ఆధారాలు కూడా సమర్పించిందని గుర్తుచేశారు. అంతేకాదు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాం తొలగించే సమయంలో కూడా బీజేపీ గుండాలు తమ నినాదాలు చేశారని గుర్తుచేశారు. అంతేకాదు షా రోడ్ షోకి వచ్చి ఆందోళన చేపట్టాలని కోరినట్టు ఉన్న వీడియోలో ఉందని వివరించారు. దీనితోపాటు టీఎంసీ, పోలీసులను ఎదుర్కొవాలని వాట్సాప్ సందేశం కూడా ఈసీకి అందజేసినట్టు పేర్కొన్నారు. అయితే కేంద్ర బలగాలు అమిత్ షాకు మద్దతుగా నిలిచాయని పేర్కొన్నారు. రోడ్ షో కోసం 71 వేల మంది సిబ్బందిని వినియోగించారని గుర్తుచేశారు. కేంద్ర బలగాల నీడన బీజేపీ పెద్దలు ఓట్లడిగారని .. రాష్ట్రంలో హింసాత్మక వాతావరణానికి కారణమెవరు అని ప్రశ్నించారు.