టీఎంసీ ఎంపీ ముకుల్ రాయ్ రాజీనామా... మమత బెనర్జీకి బిగ్ షాక్
తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత ముకుల్ రాయ్ బుధవారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
కోల్కతా : తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత ముకుల్ రాయ్ బుధవారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడుకు సమర్పించినట్లు ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు.
ముకుల్ రాయ్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, ఆయనను పార్టీ నుంచి ఆరు సంవత్సరాలపాటు బహిష్కరిస్తున్నట్లు టీఎంసీ గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ముకుల్ రాయ్ రాజీనామా చేశారు. అలాగే టీఎంసీ పదవులకు కూడా తాను రాజీనామా చేస్తానన్నారు. ఇది వ్యూహాత్మక చర్య అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మమత బెనర్జీపై ఘాటైన విమర్శలు గుప్పించారు.
టీఎంసీ వ్యవస్థాపక సభ్యుడు ముకుల్ రాయ్ రాజీనామా రాజకీయా వర్గాల్లో చర్చనీయాంశమైంది. మరోవైపు ముకుల్ రాయ్ త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది.
ఇదే విషయాన్ని విలేకరులు అడిగినప్పుడు ముకుల్ రాయ్ మాట దాటవేశారు. ''నేను బీజేపీలో చేరతానో, లేదో, ఇప్పుడే చెప్పలేను. కొంతకాలం ఆగండి..'' అని ఆయన వ్యాఖ్యానించారు.
ఆయన మద్ధతుదారులు మాత్రం అసోంలో అధికార కాంగ్రెస్ నుంచి బయటికొచ్చిన హిమాంత్ బిశ్వ శర్మ మాదిరిగానే తమ నాయకుడు కూడా వచ్చే ఎన్నికల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం చేపడతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.