వీడియో: చల్లారని పోలింగ్ హింస: అధికార పార్టీ నేత కాల్చివేత
కోల్కత: లోక్సభ ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్లో నెలకొన్న హింసాత్మక పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దాడులు, ప్రతిదాడులతో ఆ రాష్ట్రం అట్టుడికిపోతూనే వస్తోంది. కొన్ని సమస్మాత్మక జిల్లాల్లో ప్రతికార జ్వాల ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. భారతీయ జనతాపార్టీకి చెందిన కొందరు గ్రామస్థాయి నేతలు, కార్యకర్తల హత్యల కారణంగా రాజుకున్న మంట మరింత వేడెక్కుతోంది. ప్రతిదాడులకు దారి తీస్తోంది.
తాజాగా 24 పరగణ జిల్లాలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడొకరు దారుణహత్యకు గురయ్యారు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి, ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తలలో బుల్లెట్ దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడిన ఆ నాయకుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మరణించారు. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. రోడ్డు మీద మలుపులో కొందరు యువకులతో నిర్మల్ కుండు మాట్లాడుతుండటం.. అదే సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆయనపై కాల్పులు జరపడం.. ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
Killers should be hanged .... https://t.co/v6dtn3I9BJ
— PANKAJ CHOUDHARY (@PANCHOBH) June 5, 2019
24 పరగణ జిల్లా ఉత్తర ప్రాంతంలోని నింటా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హతుడిని నిర్మల్ కుండుగా గుర్తించారు. ఆయన డమ్డమ్ మున్సిపాలిటీ పరిధిలో తృణమూల్ కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. క్రియాశీలక కార్యకర్తగా ఆయనకు పేరుంది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి ఆయన తీవ్రంగా కృషి చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులతో ఆయన పలుమార్లు ఘర్షణ పడ్డారని, వారే ఈ ఘాతుకానికి కారణమై ఉంటారని అనుమానిస్తున్నారు.