బతికే ఉన్నాడు: దాడిని సమర్థించుకున్న మమతా పార్టీ
కోల్కతా: మమతా బెనర్జీ అల్లుడు, పార్టీ పార్లమెంటు సభ్యుడు అభిషేక్ బెనర్జీపై చేయి చేసుకున్న బిటెక్ విద్యార్థిపై దాడి చేయడాన్ని తృణమూల్ కాంగ్రెసు సమర్థించుకుంది. బిటెక్ విద్యార్థి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అతనికి పలుచోట్ల గాయాలయ్యాయి. అభిషేక్ బెనర్జీ పైన దాడి చేసిన వ్యక్తి 25 ఏళ్ల దేబసీష్ ఆచార్య బీటెక్ విద్యార్థి. దుర్గాపుర్లోని ఇనిస్టిట్యూట్లో చదువుతున్నాడు.
ఆవేశంలో అప్పటికప్పుటి ప్రతిస్పందనగా యువకుడిపై దాడిని టిఎంసి సమర్థించుకుంది. దేవశీష్ ఆచార్యపై తృణమూల్ కాంగ్రెసు నాయకులు, కార్యకర్తలు చేతులతో, కర్రలతో, కుర్చీలతో దాడి చేశారు. తూర్పు మిడ్నాపూర్లోని ఆస్పత్రిలో అతను ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.
ఖండనార్హహమైన యువకుడి చర్యకు అతనిపై దాడి ఆవేశంలో చోటు చేసుకుందని టిఎంసి నాయకులు అన్నారు. పెద్ద నష్టమేమీ జరగలేదని, యువకుడు బతికే ఉన్నాడని, పెద్ద విషయమేమీ కాదని తృణమూల్ కాంగ్రెసు ఉపాధ్యక్షుడు, పంచాయతీరాజ్ మంత్రి సుబ్రతా ముఖర్జీ అన్నారు.
సంఘటన మీడియాలోని ఓ వర్గం చేసిన కుట్ర అని మరో మంత్రి ఫిర్హాద్ హకీం అన్నారు. ఆ సంఘటనను ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత జరిగిన హింసతో సుబ్రతా ముఖర్జీ పోల్చారు. ఇందిరా గాంధీ హత్య తర్వాత చాలా మంది మరణించారని, ఆ విధమైనది ఏదీ ఇక్కడ జరగలేదని, యువకుడు బతికే ఉన్నాడని ఆయన అన్నారు.