మా మద్దతు ఎన్డీయే అభ్యర్థికే: మమతా బెనర్జీకి సొంత ఎమ్మెల్యేల షాక్
రాష్ట్రపతి ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆ పార్టీకి చెందిన త్రిపుర ఎమ్మెల్యేలు ఆరుగురు షాకిచ్చారు. మమతను ఇరుకున పెట్టారు.
అగర్తాల: రాష్ట్రపతి ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆ పార్టీకి చెందిన త్రిపుర ఎమ్మెల్యేలు ఆరుగురు షాకిచ్చారు. మమతను ఇరుకున పెట్టారు.
విపక్షాలు నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్కు తాము ఓటు వేసేది లేదని స్పష్టం చేశారు. దీంతో విపక్షాల అభ్యర్థికి మద్దతిచ్చిన మమతా ఇరకాటంలో పడ్డారు. త్రిపురలో సీపీఎం ప్రస్తుతం అధికారంలో ఉంది. విపక్షాల అభ్యర్థి మీరాకుమార్కు ఆ పార్టీ మద్దతు తెలుపుతోంది.
అక్కడ విపక్షంలో ఉన్న టీఎంసీకి ఈ విషయం మింగుడు పడడం లేదు. వచ్చే ఎన్నికల్లో తాము ఓడించాలనుకున్న పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థికి ఎన్నికల్లో తాము ఓటు వేసేది లేదని టీఎంసీ నేత సుదీప్ రాయ్ బర్మన్ చెప్పారు.
ఇప్పటికే ఈ విషయాన్ని బిజెపి జాతీయ కార్యదర్శికి రామ్ మాధవ్కు తెలియజేశామన్నారు. టీఎంసీ ఎమ్మెల్యేల నిర్ణయం అటు టీఎంసీని ఇరుకున పెట్టగా, బిజెపికి లబ్ధి చేకూర్చనుంది. త్రిపుర పార్టీ ఎమ్మెల్యేలపై మమత ఎలా స్పందిస్తారో చూడాలి. రాష్ట్రపతి ఎన్నికల్లో విప్ జారీ చేయకూడదు.