దీదీకి షాక్: మోడీ వ్యాఖ్యలు నిజమేనా... బీజేపీలోచేరేందుకు హస్తినకు టీఎంసీ ఎమ్మెల్యేలు
పశ్చిమ బెంగాల్: లోక్సభ ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ముఖ్యంగా బెంగాల్లో జరిగిన పోరు మాత్రం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని సారించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటినుంచే బీజేపీ బెంగాల్పై కన్నేయగా... దీదీ మాత్రం బీజేపీ బెంగాల్ గడ్డపై అడుగు పెట్టకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో బెంగాల్లో ఒక్కసారిగా రాజకీయ వేడి కనిపించింది. మరోవైపు బీజేపీ అసాధారణ ఫలితాలు సాధించడంతో ఇప్పుడు బెంగాల్లోని టీఎంసీ ఎమ్మెల్యేలంతా బీజేపీ వైపు చూస్తున్నారు.
బెంగాల్లో మారుతున్న సమీకరణాలు
లోక్సభ ఫలితాలతో బెంగాల్ ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. తన ప్రచారంలో సందర్భంగా 40కి పైగా ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారన్న ప్రధాని వ్యాఖ్యలు నిజమయ్యేలా ఉన్నాయి. బెంగాల్లో లోక్సభ ఫలితాలు వెలువడిన వెంటనే జంపింగ్లు ప్రారంభం అయ్యాయి. ముగ్గురు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సస్పెండ్ అయిన శుభ్రాంగ్షు రాయ్లు హస్తిన బాట పట్టారు. వారు టీఎంసీని వీడి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నేత ముకుల్ రాయ్తో కలిసి ఈ ముగ్గురు ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. వీరంతా బారక్పూర్ లోక్సభ పరిధిలోని నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు కావడం విశేషం. బారక్పూర్లో రెండు సార్లు ఎంపీగా గెలిచిన తృణమూల్ నేత దినేష్ త్రివేది పై బీజేపీ నేత అర్జున్ సింగ్ ఈ సారి విజయం సాధించారు.
బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న ముగ్గురు టీఎంసీ ఎమ్మెల్యేలు
ఇదిలా ఉంటే శుభ్రాంగ్షు టీఎంసీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు గాను ఆయన్ను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేయడం జరిగింది. ఈయన బిజ్పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అర్జున్ సింగ్ బంధువు సునీల్ సింగ్ నౌపారా అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. శిల్బధ్ర దత్తా బారక్పూర్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.ఇక మాజీ టీఎంసీ ఎమ్మెల్యే అర్జున్ సింగ్ లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.
దిద్దుబాటు చర్యలకు దిగిన టీఎంసీ
ఇక పార్టీ ఫిరాయింపులను అడ్డుకునేందుకు టీఎంసీ నేత రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీం రంగంలోకి దిగారు. అసంతృప్తితో ఉన్న నేతలతో ఆయన సమావేశం అవుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీని ఎవరూ వీడొద్దని చెబుతున్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లో టీఎంసీ పట్ల అసంతృప్తితో ఉన్న సోవన్ ఛటర్జీతో హకీం భేటీ అయినట్లు చెప్పారు. తిరిగి పార్టీ కోసం పనిచేయాల్సిందిగా తాను సోవన్ను కోరినట్లు హకీం చెప్పారు. ఇదిలా ఉంటే బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీష్ ఘోష్ టీఎంసీ ఎమ్మెల్యేలు చాలామంది బీజేపీలోకి వస్తారని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఫిరాయింపులు జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.