రాజీనామా చేయకుండానే బీజేపీలోకి టీఎంసీ ఎంపీ: సభ్యత్వం రద్దు చేయాలంటూ స్పీకర్కు లేఖ
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీకి చెందిన ఎంపీ సునీల్ కుమార్ మండల్ ఇటీవల భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయకపోవడంతో టీఎంసీ తాజాగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసింది. టీఎంసీ ఎంపీ సుదీప్ బెనర్జీ మంగళవారం ఈ మేరకు లేఖ రాశారు.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ తమ పార్టీకి చెందిన ఎంపీలను ప్రలోభాలకు గురిచేసి తమ పార్టీలోకి చేర్చుకుంటోందని ఎంపీ సుదీప్ బెనర్జీ తెలిపారు. డిసెంబర్ 19న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించిన సందర్భంలో తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరారని చెప్పారు.
అదే సమయంలో ఎంపీ పదవికి రాజీనామా చేయకుండా సునీల్ కుమార్ మండల్ బీజేపీలో చేరారని పేర్కొన్నారు. అందుకే, సునీల్ కుమార్ మండల్ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్-మే మధ్య కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార టీఎంసీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సువేందు అధికారి, సునీల్ మండల్,సహా పలువురు టీఎంసీకి ఎమ్మెల్యేలు, ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని, బెంగాల్లో పాగా వేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు.
టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. బీజేపీ పగటి కలలో కంటోందని ఎద్దేవా చేశారు. బీజేపీకి రెండెంకల కంటే ఎక్కువ సీట్లు వస్తే తాను రాజకీయ వ్యూహకర్తగా పనిచేయబోనని పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సవాల్ విసిరారు. దీనికి బీజేపీ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఇక ఉండడని స్పష్టం చేశారు.