పౌరసత్వ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టుకు టీఎంసీ ఎంపీ, ఇవాళే విచారించండి, తోసిపుచ్చిన సీజేఐ
పౌరసత్వ సవరణ చట్టంపై టీఎంసీ భగ్గుమంటోంది. బిల్లును వ్యతిరేకించిన ఆ పార్టీ ఇక న్యాయ పోరాటానికి సిద్ధమైంది. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. శరణార్థుల పౌరసత్వంతో ముడిపడి ఉన్న అంశమైనందున త్వరగా పిటిషన్ విచారించాలని సర్వోన్నత ధర్మసనాన్ని ఆశ్రయించారు.
పౌరసత్వ సవరణ బిల్లు ఎఫెక్ట్, భారత పర్యటనపై జపాన్ ప్రధాని అనాసక్తి, టూర్ రద్దు..?
ఇవాళే విచారించండి...
పౌరసత్వ సవరణ బిల్లుకు బుధవారం రాత్రి రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గురువారం ఆమోదం తెలుపడంతో చట్టరూపం దాల్చింది. ఈ క్రమంలో టీఎంసీ ఎంపీ మహువా.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వెంటనే పిటిషన్ విచారించాలని కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బొబ్డేను విన్నవించారు. కానీ మహువా తరపు లాయర్ విన్నపాన్ని బొబ్డే తోసిపుచ్చారు.
సోమవారం విచారణ
తీవ్రత దృష్ట్యా శుక్రవారం విచారించాలని లేదంటే 16వ తేదీ సోమవారం విచారించాలని మహువా తరఫు లాయర్ సుప్రీంకోర్టును కోరారు. ఇవాళ విచారించేందుకు సీజేఐ నిరాకరించడంతో.. సోమవారం ధర్మాసనం ముందుకొచ్చే అవకాశం ఉంది. మహువా కన్నా ముందు ఇండియన్ ముస్లిం లీగ్ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇది ప్రాథమిక హక్కులకు విరుద్ధమని ముస్లింలీగ్ పేర్కొన్నారు. కొందరినీ లక్ష్యంగా చేసుకొని పౌరసత్వ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు.
అబే పర్యటన రద్దు..?
మరోవైపు జపాన్ ప్రధాని షింజో అబే పర్యటన రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది. పౌరసత్వ సవరణ సెగలతో అసోం అట్టుడుకుతుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోమని ఆందోళన కారులు ఆందోళన బాటపట్టారు. అసోం రాజధాని గువహటి నిరసనలతో హోరెత్తుతుంది. గువహటిలో ఆందోళనల నేపథ్యంలో శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు షింజో అబే విముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ మేరకు జపాన్ మీడియా జీజీ పేర్కొన్నది. దీనిని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.