మెడిసిన్ ఓవర్డోస్?: ఆస్పత్రిలో చేరిన నుస్రత్ జహాన్, అసలేమైందంటే.?
కోల్కతా: సినీతార నుంచి రాజకీయ నేతగా మారిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ అపోలో ఆస్పత్రిలో చేరారు. మెడిసిన్ ఓవర్డోస్ కావడం వల్లే ఆమె అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. ఆదివారం రాత్రి 9.30గంటల సమయంలో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు.
బయటికి రాని విషయం..
ఈ వ్యవహారంపై పోలీసులు కూడా మెడిసిన్ ఓవర్డోస్ కేసు నమోదు చేశారు.అయితే, ఈ విషయంపై అటు పోలీసులు గానీ, ఇటు ఆస్పత్రి వర్గాలు గానీ ఏ విషయాన్ని బయటికి రానివ్వడం లేదు.
భర్త పుట్టిన రోజున స్నేహితులతో పార్టీ...
శనివారం భర్త నిఖిల్ జైన్ పుట్టిన రోజు సందర్భంగా తన స్నేహితులతో కలిసి నుస్రత్ జహాన్ పార్టీ చేసుకున్నారు. కాగా, ఈ టీఎంసీ ఎంపీ అధికార ప్రతినిధి ఈ విషయంపై మాట్లాడుతూ.. శ్వాసక్రియకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న నుస్రత్ను ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపారు.
శ్వాసకు సంబంధించిన సమస్య..
గతంలో కూడా నుస్రత్ జహాన్కు ఆస్తమా ఉంది. శ్వాసకు సంబంధించిన సమస్య తీవ్రం కావడంతోనే ఆమెను ఆస్పత్రిలో చేర్చిచాం. ఆమె తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని సదరు ఎంపీ అధికార ప్రతినిధి తెలిపారు. ఇందుకు మీడియా సహకారం అవసరమని అన్నారు.
భారీ మెజార్టీతో గెలిచి..
పశ్చిమబెంగాల్లోని బసిర్హత్ నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థిగా తొలిసారి 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన నుస్రత్ జహాన్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి సాయంతన్ బసుపై 3,50,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
పెళ్లి నాటి నుంచే వార్తల్లో నుస్రత్ జహాన్..
కాగా, ఐదు నెలల క్రితమే వ్యాపారవేత్త అయిన నిఖిల్ జైన్ను నుస్రత్ జహాన్ పెళ్లి చేసుకుంది. వీరి వివాహం టర్కీలో జరిగింది. ఆ తర్వాత ఆమె పార్లమెంటులో ఎంపీగా ప్రమాణం చేశారు. వివాహం తర్వాత నుస్రత్ జహాన్ హిందూ సాంప్రదాయాలను కొనసాగించారు. హిందువుల పండగల్లోనూ ఆమె సింధూరం ధరించి హాజరయ్యారు. దీంతో ఆమెపై ఓ వర్గం పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు.