మమతా బెనర్జీకి భారీ షాక్: టీఎంసీ ఎమ్మెల్యే పదవికి సువేందు అధికారి రాజీనామా, త్వరలో బీజేపీలోకి
కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి బారీ షాక్ తగిలింది. టీఎంసీ రెబల్ నేత సువేందు అధికారి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ స్పీకర్కు పంపారు. దీంతో సువేందు అధికారి బీజేపీలో చేరతారనే వాదనలకు మరింత బలం చేకూర్చినట్లయింది.
టీఎంసీకి భారీ షాకే.. త్వరలో బీజేపీలోకి..
గత కొంత కాలంగా టీఎంసీ పార్టీ గుర్తు, జెండాలు లేకుండానే కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు సువేందు అధికారి. ఈ వారంతంలో అంటే డిసెంబర్ 19-20 తేదీల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ పర్యటనకు రానున్నారు. అమిత్ షా కార్యక్రమంలోనే ఆయన సమక్షంలో సువేందు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం.
సువేందు అధికారి అసంతృప్తి ఎందుకంటే..
మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీపై అసంతృప్తితో ఉన్న సువేందు అధికారి నవంబర్ నెలలోనే తన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. టీఎంసీకి సంబంధించిన కీలక విషయాల్లో సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై అసంతృప్తికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఆయన చాలా కాలంపాటు కేబినెట్ సమావేశాలకు కూడా హాజరుకాలేదు.
మమతా అధికారంలోకి రావడంలో సువేందు అధికారిదే కీలక పాత్ర
కాగా, పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో సువేందు అధికారి రాజీనామాతో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. 2007లో తృణమూల్ పార్టీ అధికారంలోకి రావడానికి తూర్పు మిడ్నాపూర్లో జరిగిన నందిగ్రామ్ ఉద్యమమే ప్రధాన కారణం. ఆ ఉద్యమంలో సువేందు అధికారిదే కీలక పాత్ర. మమతా బెనర్జీ అధికారంలోకి రావడానికి ఎంతో శ్రమించారు. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరితే.. మమతా బెనర్జీ టీఎంసీకి భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Recommended Video
సువేందు అధికారి రాజీనామాపై మమతా స్పందన
మరోవైపు, సువేందు అధికారి రాజీనామాపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. తమ పార్టీలో టికెట్ దొరకదని తెలిసినవారే ఇతర పార్టీల పంచన చేరుతున్నారని అన్నారు. ఈ సందర్బంగా పరోక్షంగా బీజేపీపై విమర్శలు చేశారు. కొందరు దుండగులు బయటి నుంచి వచ్చి ఇక్కడ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాగా, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. టీఎంసీ పాలనా వైఫల్యాలపై బీజేపీ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. బీజేపీ అగ్రనేతలు కూడా ప్రచారాల్లో పాల్గొంటూ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఈసారి ఎన్నికల్లో టీఎంసీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగే అవకాశం ఉంది.