సీర్పీఎఫ్ వల్లే నేను ప్రాణాలతో బయటపడ్డాను: కోల్కతా ఘటనపై అమిత్ షా
Recommended Video
ఢిల్లీ/బెంగాల్ : బెంగాల్లో రాజకీయం రాజుకుంటోంది. మంగళవారం అమిత్ షా రోడ్ షో సందర్భంగా హింస చెలరేగిన సంగతి తెలిసిందే. దానిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మీడియాతో మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ కోల్కతాలో భయానక వాతావరణం సృష్టించిందని ఆయన మండిపడ్డారు. హింస వెనక టీఎంసీ ఉందని బీజేపీ కాదని ఆయన చెప్పారు.
మహిళా పైలట్కు వేధింపులు: నీ భర్త ఇక్కడ లేరు.. నేను ఒంటరిగా ఉన్నా... ఏమంటావ్.?
అమిత్ షా పర్యటనలో చెలరేగిన హింస
వెస్ట్బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మంగళవారం ఆ రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పర్యటనను టీఎంసీ అడ్డుకునే ప్రయత్నం చేసింది. అంతే స్థాయిలో బీజేపీ కూడా రియాక్ట్ అయ్యింది. ఇక మంగళవారం నాటి ఘటన గురించి అమిత్ షా ఢిల్లీలోని బీజేపీ ప్రధానకార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మమతాపై మాటల తూటాలను పేల్చారు అమిత్ షా. టీఎంసీ చెబుతున్నట్లుగా బీజేపీనే హింసకు పాల్పడి ఉంటే.. అలాంటి హింసాత్మక ఘటనలు ఇతర రాష్ట్రాల్లో కూడా కనిపిస్తాయని బీజేపీకి అలాంటి చరిత్ర లేదని అన్నారు.
ఒక్క బెంగాల్లోనే హింస ఎందుకు చెలరేగుతోంది..?
గడిచిన ఆరు విడతల పోలింగ్లో ఒక్క బెంగాల్లోనే హింసాత్మక వాతావరణం కనిపించిందని గుర్తుచేశారు. మమతా బెనర్జీ మాత్రం బీజేపీనే దాడులు చేయించిందని చెప్పుకొస్తున్నారని మండిపడ్డారు. మమతా బెనర్జీ పార్టీ కేవలం 42 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోందని బీజేపీ దేశవ్యాప్తంగా పోటీ చేస్తోందని గుర్తు చేశారు.కానీ ఇతర రాష్ట్రాల్లో హింసాత్మక వాతావరణం కనిపించలేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు సీఆర్పీఎఫ్ బలగాలు తనకు సెక్యూరిటీ ఇవ్వకుండా ఉన్నింటే తను ప్రాణాలతో బయటపడేవాడిని కాదని అన్నారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్కు ధన్యవాదాలు తెలిపారు.
ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని కూల్చింది టీఎంసీ కార్యకర్తలే
ఇక హింస చెలరేగుతుంటే బెంగాల్ పోలీసులు చూస్తూ ఉండిపోయారని మండిపడ్డారు అమిత్ షా. బీజేపీ కార్యకర్తలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ తమ కార్యకర్తలు సంయమనం పాటించారని చెప్పారు. ఈ సందర్భంగా టీఎంసీ కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడుతున్న ఫోటోలను మీడియా ముందు అమిత్ షా ప్రదర్శించారు. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని కూల్చింది టీఎంసీ కార్యకర్తలే అని దుయ్యబట్టారు. యూనివర్శిటీ ద్వారాలు మూసివేసి ఉన్నాయని బీజేపీ కార్యకర్తలు బయటనే ఉండగా విగ్రహాన్ని ఎలా ధ్వసం చేస్తారని అమిత్ షా ప్రశ్నించారు. మరోవైపు టీఎంసీ కూడా బీజేపీ కార్యకర్తలు సృష్టించిన బీభత్సానికి సంబంధించిన వీడియోలను ప్రదర్శించింది. ఇక తన కాన్వాయ్పై కూడా దాడులు చేశారని రాళ్లు విసిరారని అమిత్ షా ఆరోపించారు. అమిత్ షా ర్యాలీ సందర్భంగా యూనివర్శిటీ విద్యార్థులు అలజడి సృష్టించేందుకు సిద్దమవుతున్నారనే ప్రచారం జరిగినప్పటికీ పోలీసులు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడంపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమిత్ షా ఏమైనా దేవుడా..? నిప్పులు చెరిగిన మమతా
ఎన్నికల సంఘంపై కూడా అమిత్ షా నిప్పులు చెరిగారు. బెంగాల్లో హింసాత్మక వాతావరణం నెలకొంటే ఎన్నికల సంఘం ప్రశాంతంగా ఎలా ఉండగలిగిందని ప్రశ్నించారు. ఈసీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందన్న అమిత్ షా... టీఎంసీ పట్ల మెతకగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మాత్రమే హింస సృష్టిస్తున్న టీఎంసీ కార్యకర్తలను ముందస్తుగా ఎందుకు అదుపులోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు.ఇలా అయితే ఎన్నికల సంఘం నిబద్ధతను ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉందని అన్నారు అమిత్ షా. ఇదిలా ఉంటే అమిత్ షా పర్యటన పట్ల నిరసన వ్యక్తం చేసే హక్కులేదా అని దీదీ ప్రశ్నించారు. ఆయన ఏమైనా దేవుడా అని ధ్వజమెత్తారు. బయట వ్యక్తులను తీసుకొచ్చి బీజేపీ హింస సృష్టిస్తోందని ఫైర్ బ్రాండ్ ఫైర్ అయ్యారు. కలకత్తా యూనివర్శిటీ చరిత్ర ఏంటో బీజేపీకి తెలుసా అని ప్రశ్నించారు. కొన్ని చోట్ల మోడీ, అమిత్ షా కటౌట్లు ఉన్నాయని వాటిపై ఈసీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని మమతా ప్రశ్నించారు.