ఆరుగురికి ప్రాణం పోసిన ఐదేళ్ల చిన్నారి
కోయంబత్తూరు: ఐదేళ్ల చిన్నారి తాను చనిపోతూ మరో ఆరుగురి ప్రాణాలను నిలబెట్టింది. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్లోని కరూర్ ప్రాంతానికి చెందిన జనశృతి(5) అనే చిన్నారి జనవరి 2న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది.
చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో కరూర్లోని కేఎమ్సీహెచ్ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులుగా బాలిక అవయవాలు చికిత్సకు స్పందించకపోవడంతో గురువారం ఉదయం బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు.
వైద్యుల సూచన మేరకు జనశృతి తల్లిదండ్రులు తమ కూతురి అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు. చిన్నారి గుండె, ఒక కిడ్నీ, కాలేయాన్ని చెన్నై మెడికల్ మిషన్ ఆస్పత్రికి, ఫోర్టిస్, అపోలో ఆస్పత్రులకు ప్రత్యేక విమానం ద్వారా తరలించారు.
మరో కిడ్నీని కేఎంసీహెచ్కు, రెండు కళ్లను స్థానిక అరవింద్ కంటి ఆస్పత్రికి తరలించారు. కూతురు తమతో లేకపోయినా తన అవయవాలతో ఆరుగురికి ప్రాణం పోసిందని వారిలోనే తమ కూతురిని చూసుకుంటామని బాలిక తండ్రి చెప్పారు.
చిన్నవయసులోనే అవయవాలు దానం చేసిన వారిలో జనశ్రుతే మొదటి చిన్నారి అని కేఎమ్సీహెచ్ డైరెక్టర్ అరుణ్ ఎన్ పాలనిస్వామి తెలిపారు.