కార్టూన్ దెబ్బ: సీఎం, కలెక్టర్, ఎస్పీలు నగ్నంగా.., తమిళ కార్టూనిస్ట్ బాల అరెస్టు, బెయిల్ పై విడుదల
వడ్డీ వ్యాపారుల వేధింపులకు తాళలేక అక్టోబరు 23న ఇసక్కి ముత్తు అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలు, భార్యతో కలిసి తిరునల్వేలి కలెక్టరేట్ కు వచ్చి అక్కడే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
చెన్నై: తమిళనాడు సీఎం, తిరునల్వేలి కలెక్టర్, ఎస్పీలపై వ్యంగ్య కార్టూన్ వేసిన తమిళ కార్టూనిస్ట్ జి.బాల(36) అలియాస్ బాలక్రిష్ణన్ను పోలీసులు అరెస్టుచేశారు. తిరునల్వేలి కలెక్టర్ చేసిన ఫిర్యాదు మేరకు క్రైమ్ బ్రాంచి పోలీసులు ఆదివారం బాలను అదుపులోకి తీసుకున్నారు.
వడ్డీ వ్యాపారుల వేధింపులకు తాళలేక అక్టోబరు 23న ఇసక్కి ముత్తు అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలు, భార్యతో కలిసి తిరునల్వేలి కలెక్టరేట్ కు వచ్చి అక్కడే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై 'లయన్స్ మీడియా' వెబ్సైట్ను నడుపుతున్న బాల ఓ వ్యంగ్య చిత్రాన్ని గీశారు.
ఓ చిన్నారి మంటల్లో కాలిపోతుండగా సీఎం, కలెక్టర్, పోలీస్ కమిషనర్ బట్టలు లేకుండా కండ్లు మూసుకోవడంతోపాటు నోట్ల కట్టలను అడ్డు పెట్టుకున్నట్టు బాల కార్టూన్ను వేశారు. ఈ కార్టూన్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
బాల వేసిన కార్టూన్ను, 38 వేల మంది షేర్ చేయగా కొన్ని లక్షల మంది వీక్షించారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రమైన ఆగ్రహంతోనే తాను ఆ కార్టూన్ ను వేసినట్లు బాల పేర్కొన్నారు.
దీనిపై కలెక్టర్ సందీప్ మాట్లాడుతూ ఆ కార్టూన్పై స్పందించకుంటే.. తాము లంచాలు తీసుకున్నామని ప్రజలు భావించే ప్రమాదం ఉందన్నారు. మరోవైపు బాల అరెస్టును కార్టూనిస్టు, పాత్రికేయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. బాలను బలంతంగా లాక్కెళ్లిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
నా కార్టూన్లు ఆగవు: బాల
వివాదాస్పద కార్టూనిస్ట్ బాలకు తిరునల్వేలి జిల్లా కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా కార్టూనిస్ట్ బాల మాట్లాడుతూ తానెటువంటి నేరం చేయలేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఇలాంటి చర్యలకు తాను భయపడనని, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తన కార్టూన్లతో ఎత్తి చూపేందుకు వెనుకాడననిఅన్నారు. ప్రభుత్వ అసమర్థతపై కార్టూన్లు వేస్తూనే ఉంటానన్నారు.