30 ఏళ్లుగా పిల్లల్ని విక్రయిస్తున్నా.. దేవుడి దయవల్ల ఇబ్బందులు లేవు.. ఆడియో క్లిప్ కలకలం
చెన్నై : పసికందుల విక్రయం తమిళనాడులో హాట్ టాపికయింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 30 ఏళ్ల నుంచి ఈ దందా యధేచ్ఛగా సాగుతోందనే ప్రచారం కలవరం రేపుతోంది. రిటైర్డ్ నర్సు ప్రధాన సూత్రధారిగా వెలుగులోకి వచ్చిన ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేవుడి దయవల్ల 30 సంవత్సరాలలో ఎలాంటి ఇబ్బందులు రాలేదని.. పిల్లల విక్రయంలో సమస్యలేమీ లేవని ఆమె మాట్లాడిన తీరు ప్రకంపనలు సృష్టిస్తోంది.
బ్రహ్మాండంగా దందా.. వాలంటరీ రిటైర్మెంట్
రిటైర్డ్ నర్సు. ఈ దందా బ్రహ్మాండంగా నడుస్తుండటంతో.. ఇక డ్యూటీ ఎందుకని స్వచ్ఛంద పదవీ విరమణ చేసిందట. 30 ఏళ్లుగా పిల్లల్ని విక్రయిస్తోందట. ఇదంతా ఎవరో చెప్పింది కాదు. స్వయంగా ఆమె మాట్లాడిన ఆడియో క్లిప్ లీక్ కావడంతో విషయం కాస్తా బయటపడింది.
ఇంటర్ ఉచ్చు : ప్రభుత్వంపై నజర్.. టార్గెట్ జగదీశ్ రెడ్డి.. బర్తరఫ్ కోసం విపక్షాల పట్టు
30 ఏళ్లుగా విక్రయిస్తున్నా.. ఇబ్బందులు రాలేదు..!
నమక్కల్ జిల్లాలో పసికందుల విక్రయం గురించి వాట్సాప్ లో వైరలయిన ఆడియో క్లిప్ కలకలం రేపుతోంది. సేలం జిల్లాలోని ఒమలూర్ ప్రాంతానికి చెందిన దంపతులతో ఆమె మాట్లాడిన సంభాషణ సంచలనమైంది. పిల్లలు లేని కారణంగా ఆ దంపతులు ఫోన్ ద్వారా రిటైర్డ్ నర్సును సంప్రదించారు. అయితే వారిని నమ్మించే ప్రయత్నంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని చెబుతూ.. 30 ఏళ్లుగా తాను పిల్లలను విక్రయిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అడ్వాన్స్ గా 30వేల రూపాయలు ఇస్తే మీ పేరు నమోదు చేసుకుంటానంటూ మాట్లాడింది. దేవుడి దయవల్ల ఇన్నేళ్లుగా పట్టుబడలేదని.. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని భరోసా ఇచ్చింది.
మగపిల్లాడికి 4.. ఆడపిల్లకు 3 లక్షలు..!
ఇక బర్త్ సర్టిఫికెట్, లీగల్ ప్రొసీజర్ కావాలంటే అదనంగా 70వేలు ఇవ్వాలట. తొలుత అడ్వాన్స్ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. సదరు చిన్నారి తన దగ్గరకు వచ్చాక పార్టీకి చూపిస్తుందట. రూపం, రంగును బట్టి ఆడపిల్లలైతే 3 లక్షల రూపాయల వరకు.. మగపిల్లలైతే 4 లక్షల రూపాయల వరకు ధర ఫిక్స్ చేసింది. అయితే తాజాగా ఈ ఆడియో క్లిప్ వెలుగుచూసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పిల్లలను విక్రయించడంలో పెద్ద రాకెట్ ఉండొచ్చనే దిశగా దర్యాప్తు మొదలుపెట్టారు.
ఆమెతో పాటు భర్త అరెస్ట్
తమిళనాడును కుదిపేసిన ఈ ఘటనతో స్టేట్ హెల్త్ సెక్రటరీ అలర్టయ్యారు. ఈ కేసును దర్యాప్తు చేయాల్సిందిగా నమక్కల్ జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఆ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆడియో క్లిప్ సంభాషణల ద్వారా రిటైర్డ్ నర్సు నమక్కల్ జిల్లా రాశిపురానికి చెందిన ఆముదగా గుర్తించారు. ఆమెతో పాటు భర్త రవిచంద్రన్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ సమక్షంలో దాదాపు 11 గంటల పాటు వారిని విచారించి తదనంతరం కస్టడీలోకి తీసుకున్నారు.
షాకింగ్ : రైలుపైకి ఎక్కి.. హై టెన్షన్ విద్యుత్ తీగలు తాకి.. యువకుడి ఆత్మహత్య
ఆమె వెనుక ఎవరు?.. ఇంకెన్ని ట్విస్టులో
ఎలాంటి అడ్డూఅదుపు లేకుండా 30 ఏళ్లుగా సాగిన పిల్లల విక్రయం తీరు చూస్తుంటే విస్మయం కలిగిస్తోంది. ఇన్నాళ్లు రిటైర్డ్ నర్సు ఆడిందే ఆటగా సాగిందంటే.. ఆమె వెనుక ఇంకేవరైనా ఉన్నారా? రాజకీయ అండదండలు ఉన్నాయా?.. అనే కోణంలో ఆరా తీస్తున్నారు. 30 సంవత్సరాలతో వందలాది మంది పిల్లలు చేతులు మారి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి తీగ లాగితే డొంక కదిలినట్లు.. ఈ కథలో ఇంకెన్ని ట్విస్టులు బయటపడతాయో చూడాలి.