మళ్లీ మొదటి నుంచి: తమిళనాడు ఎమ్మెల్యేల అనర్హత వేటు కేసులో కొత్త జడ్జీ నియామకం
తమిళనాడులో దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటిషన్ మరో మలుపుతీసుకుంది. ఈ కేసుపై జూన్ 14న వాదనలు జరుగగా ఇద్దరు జడ్జీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఎమ్మెల్యేలపై అనర్హత ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కేసును మరో హైకోర్టుకు బదిలీ చేయాలంటూ సుప్రీం కోర్టులో ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేశారు. అయితే కేసును మరో కోర్టుకు బదిలీ చేయడం కుదరదని వ్యాఖ్యానించిన అత్యున్నత న్యాయస్థానం.... ఈ కేసును మళ్లీ మొదటి నుంచి విచారణ చేసేందుకు కొత్తగా మూడో జడ్జి అయిన జస్టిస్ సత్యనారాయణ్ను నియమించింది.
తీర్పును వెలువరించడంలో జాప్యం చేస్తున్న కోర్టుపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలను సుప్రీంకోర్టు మందలించింది. కోర్టుపై ఇలాంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేయరాదంటూ హెచ్చరించింది. ఇది చాలా సీరియస్ విషయమని, ఈ కేసుకు మొదటి ప్రాధాన్యతగా పరిగణించి త్వరగా విచారణ చేయాలని ఎమ్మెల్యేల తరపున అడ్వకేట్ వికాస్ సింగ్ డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు నియమించిన జడ్జి గురించి వాట్సాప్లో ప్రజలకు తెలిసిపోయిందని వికాస్ సింగ్ ఆరోపించారు. అయితే కోర్టు వాట్సాప్ మెసేజ్ల ఆధారంగా వెళ్లదని స్పష్టం చేసింది .