కాలేజ్ స్నేహితురాలి అశ్లీల ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్: ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసి పరువు తీస్తా!
బెంగళూరు: స్నేహితురాలిని బెదిరించి అర్దనగ్నంగా తయారు చేసి ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిని బెంగళూరులోని కలాసిపాళ్య పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మహిళ అశ్లీల ఫోటోలు తీసిన మొబైల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తమిళనాడుకు చెందిన గిల్బర్ట్ జాన్ కాలేజ్ లో చదివే సమయంలో అదే కాలేజ్ లో చదివే యువతితో పరిచయం పెంచుకున్నాడు. తరువాత యువతితో జాన్ సన్నిహితంగా ఉన్నాడు. రైల్వే శాఖలో ఉద్యోగం చేసే వ్యక్తితో యువతికి వివాహం అయ్యింది.
భర్తతో కలిసి బెంగళూరు చేరుకున్న ఆమె కలాసిపాళ్య సమీపంలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటోంది. పీహెచ్ డీ చదువుతున్న జాన్ స్నేహితురాలి ఇంటికి వెళ్లేవాడు. అయితే కొంతకాలం క్రితం జాన్ ను ఆమె స్నేహితురాలు దూరం పెట్టింది.
మూడు రోజుల క్రితం ఆమె కలాసిపాళ్య సమీపంలో నడిచి వెలుతున్న సమయంలో జాన్ ఆమెకు కనిపించాడు.స్నేహితురాలి ఇంటికి వెళ్లిన జాన్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. స్నేహితురాలి దుస్తులు చింపి అర్దనగ్నంగా తయారు చేసి ఫోటోలు తీసిన జాన్ ఆమెను వేధింపులకు గురి చేశాడు.
తన కోరిక తీర్చకుంటే ఈ ఫోటోలు మీ కుటుంబ సభ్యులకు చూపించి ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసి మీ పరువు తీస్తానని ఆమెను జాన్ బ్లాక్ మెయిల్ చేశాడు. జాన్ వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు జాన్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.