ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు వాయిదా వెయ్యండి, ప్రభుత్వం పట్టించుకోలేదు !
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు ఈనెల 21వ తేదీ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు వాయిదా వెయ్యాలని తమిళనాడు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కన్యాకుమారి జిల్లా ప్రజల ఆందోళనకు తమిళనాడులోని అనేక జిల్లాల ప్రజల మద్దతు ఇస్తున్నారు.
మొత్తం పూర్తి అయ్యింది !
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ఇప్పటికే పలువురు నామినేషన్లు వేశారు. నామినేషన్లు పరిశీలించిన ఎన్నికల కమిషన్ అధికారులు అభ్యర్థులకు గుర్తులు కేటాయించడం జరిగింది. అయితే తమిళనాడు ప్రజలు ఇప్పుడు ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు వాయిదా వెయ్యాలని మనవి చేస్తున్నారు.
వెయ్యి మంది గల్లంతు
ఈనెల ప్రారంభంలో ఓఖీ తుపాను కారణంగా తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని 1, 000 మంది జాలర్లు సుముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లి గల్లంతు అయ్యారని, వారిని రక్షించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
తమిళనాడులో మరో ఉద్యమం
గురువారం నుంచి కన్యాకుమారి జిల్లాలో సముద్రంలో గల్లంతు అయిన జాలర్ల కుటుంబ సభ్యులు, స్థానికులు పెద్ద ఆందోళనలు, రైలు రోకోలు చేస్తున్నారు. ప్రభుత్వంతో సహ అన్ని పార్టీల నాయకుల ఆర్ కే నగర్ ఉప ఎన్నికల మీద దృష్టి పెట్టాయని, మా గోడు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
జల్లికట్టు తరహాలో !
కన్యాకుమారి జిల్లా ప్రజల ఆవేదనకు చలించిపోయిన తమిళ ప్రజలు, ఆర్ కే నగర్ ఓటర్లు ఉప ఎన్నికలు వాయిదా వెయ్యాలని ఎన్నికల కమిషన్ తో సహ ప్రభుత్వానికి మనవి చేస్తున్నారు. జల్లికట్టు తరహాలో జాలర్ల కుటుంబ సభ్యుల ఆందోలనకు మద్దతు లభిస్తోంది.