ఆర్ టీసీ చార్జీల దెబ్బ: కాలేజ్ విద్యార్థుల మరో ఉద్యమం, జైల్లో 10 మంది, స్టాలిన్, క్యాప్టెన్!
చెన్నై: ఆరు సంవత్సరాల తరువాత ఒక్కసారిగా 67 శాతం బస్సు చార్జీలు పెంచడంతో తమిళనాడులో విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారం రోజుల నుంచి తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కాలేజ్ విద్యార్థులు రోడ్ల మీద ఆందోళన చేస్తున్నారు. మంగళవారం ఆందోళన సృతి మించడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. మదురైలో 10 మంది విద్యార్థులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. స్టాలిన్, క్యాప్టెన్ విజయ్ కాంత్, శరత్ కుమార్ బస్సు చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు.
వేలూరులో లాఠీచార్జ్
వేలూరులోని ముత్తురంగం ప్రభుత్వ ఆర్ట్ కాలేజ్ విద్యార్థులు వారం రోజుల నుంచి తరగతులు బహిష్కరించి ఆర్ టీసీ బస్సు చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం విద్యార్థులు తరగతులు బహిష్కరించి రోడ్డురోకో చెయ్యడానికి ప్రయత్నించారు. ఆ సందర్బంలో పోలీసులు విద్యార్థుల మద్య వాగ్వివాదం జరగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి విద్యార్థులను చెదరగొట్టారు.
జైల్లో విద్యార్థులు
ఆర్ టీసీ బస్సు చార్జీలు తగ్గించాలని ఈరోడ్, కుంబకోణంలో కాలేజ్ విద్యార్థులు చేస్తున్న ఆందోళన ఉదృతం అయ్యింది. రోడ్ల మీద బైఠాయించిన విద్యార్థులు ఆందోళనకు దిగడంతో వాహన సంచారం అస్తవ్యస్థం అయ్యింది. ఈరోడ్డు, కుంబకోణంకు చెందిన 10 మంది విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతో వారిని మదురై జైలుకు తరలించారు.
ఎంకే స్టాలిన్
ఆర్ టీసీ బస్సు చార్జీలు తగ్గించాలని డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో చెన్నైలో జరిగిన ధర్నాలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ పాల్గొన్నారు. రోడ్డు మీద బైఠాయించిన ఎంకే. స్టాలిన్ వెంటనే బస్సు చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రజలు, విద్యార్థులు వ్యతిరేకిస్తున్నా ఆర్ టీసీ బస్సు చార్జీల విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని స్టాలిన్ మండిపడ్డారు.
ఆర్ టీసీ బస్సులో క్యాప్టెన్
డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు, సినీనటుడు క్యాప్టెన్ విజయ్ కాంత్ మంగళవారం చెన్నైలోని మెట్రో ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (సిటీ బస్సు)లో టిక్కెట్ తీసుకుని ప్రయాణించి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. బస్సులోని ప్రయాణికులతో మాట్లాడిన క్యాప్టెన్ విజయ్ కాంత్ బస్సు చార్జీల పెంపు విషయంలో వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. వెంటనే ఆర్ టీసీ బస్సు చార్జీలు తగ్గించాలని క్యాప్టెన్ విజయ్ కాంత్ డిమాండ్ చేశారు.
శరత్ కుమార్ నిరసన
సమతువ మక్కల్ పార్టీ వ్యవస్థాపకుడు, బహుబాష నటుడు శరత్ కుమార్ మంగళవారం చెపక్ ప్రాంతంలో పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ధర్నాలో పాల్గొని వెంటనే బస్సు చార్జీలు తగ్గించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తమిళనాడు మొత్తం
ఒక్కసారిగా 67 శాతం బస్సు చార్జీలు పెరగడంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం అవుతోంది. ఇలాంటి ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్దిచెబుతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు. అయితే బస్సు చార్జీలు తగ్గించే పరిస్థితి లేదని తమిళనాడు ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది.