జయ ఆరోగ్యం: పుకార్లు చేస్తే మీ అంతు చూస్తాం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషయంపై ఎవరైనా పుకార్లు చేసి ప్రజలను ఆందోళనకు గురి చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తమిళనాడు పోలీసు అధికారులు హెచ్చరించారు. జయలలిత ఆరోగ్యం విషయంపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేస్తుందని పోలీసు అధికారులు ప్రజలకు మనవి చేశారు.
అంతే కాని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు జయలలిత ఆరోగ్యంపై పుకార్లు వ్యాపింపచేస్తే అలాంటి వారిని గుర్తించి జైలుకు పంపిస్తాని పోలీసు అధికారులు హెచ్చరించారు. జయలలిత ఆరోగ్యం విషయంపై పుకార్లు నమ్మరాదని, ఎలాంటి ఆందోళనలు చెయ్యరాదని పోలీసు అధికారులు ప్రజలకు మనవి చేశారు.
అనారోగ్యం కారణంగా జయలలిత సెప్టెంబర్ 22వ తేదిన అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అమ్మ ఆరోగ్యం విషయంపై సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించడంతో ఆమె అభిమానులను ఆందోళనకు గురి చేసి శాంతి భద్రతలు లోపించడానికి కారణం అయిన 54 మంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు.
తమిళనాడుతో సహ కర్ణాటక, విదేశాల్లో ఉన్న వారి మీద కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే అనేక మందిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. జయలలిత ఆరోగ్యం మీద పుకార్లు చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే ఐటీ విభాగం నాయకులు చెన్నై నగర పోలీసు అధికారులకు ఇప్పటికే ఫిర్యాదు చేశారు.