కేంద్ర ఎన్నికల కమిషన్: శేషన్ కు ముందు.. శేషన్ కు తరువాత..!
చెన్నై: టీఎన్ శేషన్. పూర్తి పేరు తిరునెళ్లై నారాయణన్ అయ్యర్ శేషన్. మలయాళీ. కేరళలోని పాలక్కాడ్ జిల్లా తిరునెళ్లైలో జన్మించిన ఆయన దేశ దశ దిశను మార్చివేసే ఎన్నికల నిర్వహణలో అసాధారణ సంస్కరణలను తీసుకొచ్చారు. దేశ ఎన్నికల కార్యాలయానికి ఆయన పదో ప్రధాన కమిషనర్. అప్పటిదాకా మూస ధోరణిలో సాగుతున్న కేంద్ర ఎన్నికల సంఘం పనితీరును సమూలంగా మార్చేశారు. ప్రధాన కమిషనర్ గా తన మార్క్ ఏమిటో చూపించారు. దేశ ఎన్నికల వ్యవస్థలో శేషన్ కు ముందు.. శేషన్ కు తరువాత.. అనే పరిస్థితిని తీసుకొచ్చారు. సంస్కరణలను అమలు చేయడంలో రాజకీయ పార్టీల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినప్పటికీ.. వెనుకంజ వేయలేదు.
మాజీ కేంద్ర ఎన్నికల అధికారి టీఎన్ శేషన్ మృతి
సీఈసీలో గోల్డెన్ ఎరా..
జన్మత: శేషన్ మలయాళీ అయినప్పటికీ.. 1955 బ్యాచ్ తమిళనాడు కేడర్ ఐఎఎస్ అధికారి కావడంతో ఆ రాష్ట్రంతో ఆయనకు అనుబంధం ఎక్కువ. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ గా 1990 డిసెంబర్ లో బాధ్యతలను స్వీకరించారు. ఆరేళ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఎన్నికల కమిషన్ కు సంబంధించినంత వరకూ అదో గోల్డెన్ ఎరా. కాగితాలకే పరిమితమైన ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనల పొల్లుపోకుండా అమలు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ అప్పట్లో రాజకీయ పార్టీల నాయకులు ఇచ్చిన వినతిపత్రాలన్నీ చెత్తబుట్ట పాలయ్యాయి. ఏ ఒక్క వినతిపత్రాన్ని కూడా శేషన్ తన దృష్టికి కూడా రానివ్వలేదు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళికి ఆద్యుడు..
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయడానికి శేషనే శ్రీకారం చుట్టారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గాల్లో కుప్పలు తెప్పలుగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి చెక్ పెట్టారు. పోలింగ్ కు 25 రోజుల ముందు నుంచే ఎన్నికల ప్రవర్తనా నియామవళిని అమల్లోకి తీసుకొచ్చే విధానాన్ని అమలు చేశారు. గుర్తింపు కార్డుల వ్యవస్థనూ తెర మీదికి తీసుకొచ్చారు. ఓటర్ల స్లిప్ లో పేరు, ఫొటో ఉంటే సరిపోదనే ఉద్దేశంతో.. ప్రత్యేకంగా గుర్తింపు కార్డును చూపించాలనే నిబంధనను కూడా అమల్లోకి తీసుకొచ్చింది శేషనే.
ఎన్నికల వ్యయంపై పరిమితి, ప్రచార సమయం కుదింపు..
ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుపై పరిమితిని విధించాలనే నిబంధనను కఠినంగా అమల్లోకి వచ్చింది కూడా శేషన్ హయాంలోనే. విచ్చలవిడిగా బ్యానర్లు కట్టడాన్ని నిషేధించారు. బ్యానర్లు, పోస్టర్లు ఓటర్లను ప్రభావితం చేస్తాయనేది ఆయన ఉద్దేశం. అందుకే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తరువాత సంబంధిత నియోజకవర్గాల పరిధిలో ఒక్క బ్యానర్ గానీ, ఎన్నికల గుర్తులు గానీ కనిపించకుండా చర్యలు తీసుకున్నారు. ఓటర్లు స్వేచ్ఛగా.. తమ ఇచ్ఛానుసారం ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించారు. రాత్రి 10 గంటలు దాటిన తరువాత ఎన్నికల ప్రచారాన్ని సైతం నిషేధించింది ఆయనే.
రాష్ట్రపతి పదవికి పోటీ చేసి..
రాష్ట్రపతి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారయన. అది కాస్తా కలిసి రాలేదు. రాష్ట్రపతి పదవి కోసం పోటీ చేసి ఓటమి చవి చూశారు. కేఆర్ నారాయణన్ పై పోటీ చేసిన ఆయనకు ఎలక్టోరల్ కాలేజీలో మెజారిటీ చెప్పుకోదగ్గ స్థాయిలో రాలేదు. అప్పటి ఎన్నికల్లో కమ్యూనిస్టులు మినహా మిగిలిన రాజకీయ పార్టీలేవీ ఆయనకు మద్దతు ఇవ్వలేదు. తన ఓటమిని హుందాగా అంగీకరించారు. పదవీ విరమణ చేసిన అనంతరం శేషన్.. చెన్నైలో స్థిరపడ్డారు. తరచూ ఆలయాలను సందర్శించేవారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో వెలిసిన సత్యసాయిబాబా ఆశ్రమాన్ని ఆయన పలుమార్లు సందర్శించారు.